నో వర్క్.. నో పే.. వారికి వేతనం ఇవ్వొద్దు: బీజేపీ నేతకు దిమ్మతిరిగే షాకిచ్చిన కవిత
Recommended Video
న్యూఢిల్లీ: ఏపీ ప్రజలు తమకు సోదరులు అని, వారికి మంచి జరగాలని తాము కోరుకుంటున్నామని టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం చెప్పారు. నిరసనల కారణంగా పార్లమెంటు నిత్యం వాయిదా పడుతోంది. టీడీపీ, వైసీపీలు ప్రతి రోజు అవిశ్వాస తీర్మానం ఇస్తున్నప్పటికీ నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి.
టీఆర్ఎస్ సభ్యులు సభలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఆందోళనల వెనుక కేంద్రం ఉందని టీడీపీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి స్పందించారు. విభజన హామీలు అమలు చేయాలని తాము కూడా అడుగుతున్నామన్నారు.
బాబు వల్లే: అవిశ్వాసంపై రోజా రివర్స్ కౌంటర్, 'బీజేపీ సమావేశాలకు పవన్ కళ్యాణ్'
బీజేపీకి ధైర్యం లేకనే సభ నాయిదా
రిజర్వేషన్ల అంశంపై తాము పోరాటం చేస్తున్నామని, తమ పోరాటం అవిశ్వాస తీర్మానానికి అడ్డు కాదని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారు. బీజేపీకి ధైర్యం లేకనే సభ వాయిదా వేస్తోందన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని అడుగుతున్నామన్నారు.
హక్కుల కోసం మేం మొదటి నుంచి ఇలానే చేస్తాం
తమ హక్కులను సాధించుకోవడం కోసం మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీనే సభలో ఆందోళనలు నిర్వహించడం సాధారణ విషయమే అన్నారు. గతంలో రాజకీయ నేతల వల్ల ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య తేడాలు వచ్చాయని, ఇప్పుడు అందరం అన్నదమ్ములమే అన్నారు.
ప్రత్యేక హోదా చర్చకు వస్తే వంద శాతం మద్దతు
ప్రత్యేక హోదా అంశం చర్చకు వస్తే తాము వంద శాతం మద్దతు ఇస్తామని ఇప్పటికే చెప్పామని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. విభజన హామీలపై కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. చట్టం ప్రకారం ఏపీకి, తెలంగాణకు రావాల్సినవి రావాలని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. ఏపీకి ఎంత ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఈ రోజు స్పీకర్ను కలిసి పదేపదే వాయిదా సరికాదని చెప్పామన్నారు.
మనోజ్ తివారీకి కవిత గట్టి కౌంటర్
ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ, ఢిల్లీ శాఖ అధ్యక్షులు మనోజ్ తివారీ చేసిన ఓ ప్రతిపాదనకు టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. గత పన్నెండు రోజులుగా సభ వాయిదాలు పడుతోంది. సభకు అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
నో వర్క్ నో పే అంటూ ఎంపీలకు..
ఇందులో భాగంగా సభను అడ్డుకునే సభ్యులపై చర్చలు తీసుకోవాలని, వారి వేతనాల్లో కోత విధించాలని కోరుతూ 'నో వర్క్ నో పే' అంటూ మనోజ్ తివారీ స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఓ లేఖ రాశారు. ఎంపీల అర్థం లేని రాద్దాంతం, అర్థంలేని గందరగోళం తనను ఎంతగానో బాధిస్తోందని, పన్నెండు రోజులుగా సభ సజావుగా సాగడం లేదని, దీని వల్ల విలువైన ప్రజాధనం, సమయం వృథా అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరూ కావాలని చేయరు
దీనికి కవిత కౌంటర్ ఇచ్చారు. సమస్యలను ఎప్పటికి అప్పుడు పరిష్కరిస్తే ఏ ఎంపీ లేదా పార్టీ కావాలని పార్లమెంటులో ఆందోళన చేయరనే విషయం ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. తివారి తీరు చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు.