'గాంధీ' వల్లే గెలిచా, లేదంటే ఇక్కడకు పిలిచేవారా, ఇంగ్లాండ్ పరిస్థితి రావాలి: వరుణ్ గాంధీ
హైదరాబాద్: భారత పార్లమెంటరీ వ్యవస్థలో మార్పులు రావాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. ప్రజలు, యువత గొంతు వినాలన్నారు. శనివారం 'దక్కన్ డైలాగ్ -బిల్డింగ్ మోర్ ఈక్వల్ ఇండియా' అనే సదస్సులో ఆయన ప్రసంగించారు.
దేశంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ రాజకీయ వారసత్వం, రాజకీయ గురువు లేనిదే రాణించలేని పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు.
నా పేరు పక్కన గాంధీ ఉండటం వల్లే గెలిచా
తన పేరు పక్కన గాంధీ అని ఉండటం వల్లే చిన్న వయస్సులో పార్లమెంటు సభ్యుడిగా గెలిచానని వరుణ్ గాంధీ చెప్పారు. గాంధీ అని లేకుంటే తనను ఇక్కడకు పిలిచి మాట్లాడించేవారా అని కూడా వ్యాఖ్యానించారు.
60 శాతం సంపదన ఒక శాతం సంపన్నుల చేతిలో
దేశంలో 50 శాతం మంది మహిళలు, 50 శాతం మంది యువతకు ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని వరుణ్ గాంధీ అన్నారు. దేశంలో 60 శాతం సంపద, ఒక శాతం ఉన్న సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నదని చెప్పారు.
ఇంగ్లాండ్ లాంటి పరిస్థితి రావాలి
ఇంగ్లాండు తదితర 40 దేశాల్లో వినతిపత్రంపై పదివేల మంది సంతకం చేస్తే పార్లమెంటు సమాధానం ఇస్తుందని, లక్షమంది సంతకం చేస్తే పార్లమెంటులో చర్చిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి మన దేశంలోను రావాలన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలను అడగాలి
విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడం ద్వారా ముంబై, హైదరాబాద్ యువత సాధించిన విజయగాథలను రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రస్తావించారు. తమ సమస్యలను సభలో ప్రస్తావించాలని ప్రజలు తమ తమ నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలను అడగాలన్నారు.
అందరికీ సమానత్వం, సమాన అవకాశాలు
ప్రజాస్వామ్య భారత దేశంలో అందరికీ సమాజంలో సమానత్వం, సమాన అవకాశాలు ఉండాలని వరుణ్ గాంధీ అన్నారు. తన పేరు వెనుక గాంధీ లేకుంటే రెండుసార్లు ఎంపీగా గెలిచి ఉండకపోయేవాడినని అభిప్రాయపడ్డారు. పేర్లు ముఖ్యం కాదని, వరుసలోని చివరి వ్యక్తి వరకు అవకాశాలు ఉండాలన్నారు.
మిథాలీ రాజ్ ఏమన్నారంటే
యువత, మహిళలు నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని సవాళ్లను స్వీకరించి విజయం దిశగా పురోగమించాలని క్రికెటర్ మిథాలీ రాజ్ చెప్పారు. సమాజానికి మన వంతు సహకారం చేయాలని ఆమె అన్నారు.