వరంగల్ ఉప ఎన్నిక ప్రశాంతం, గెలుపుపై ధీమా: 24న షాక్ ఎవరికో?
వరంగల్: వరంగల్ ఉప ఎన్నిక శనివారం నాడు ప్రశాంతంగా ముగిసింది. బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ టిఆర్ఎస్, ఎన్డీయే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్యనే పోటాపోటీ నెలకొంది. విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకత పైన ఆశలు పెట్టుకోగా, 16 నెలల తమ పాలనే గెలిపిస్తుందని టిఆర్ఎస్ నమ్ముతోంది.
సాయంత్రం అయిదు గంటల సమయం లోగా వచ్చిన వారిని బట్టి చూస్తే దాదాపు 65 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఏ పార్టీకి ఎంత ఓటు షేర్ వస్తుందనేది చర్చనీయాంశవుతోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్కు 56.33 శాతం, కాంగ్రెస్కు 22.41 శాతం, బిజెపికి 15.93 శాతం ఓటు షేర్ వచ్చింది. టిఆర్ఎస్ అభ్యర్థి ఓడినా, గెలిచినా మెజార్టీ తగ్గినా అది కెసిఆర్ పాలనకు ఇబ్బందికర పరిణామమే. మెజార్టీ పెరిగితే మాత్రం విపక్షాలకు షాక్ తగులుతుంది.
సాయంత్రం ఐదు గంటల సమయానికి పోలింగ్ ముగిసింది. అయితే అయిదు గంటల లోపు వరుసలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 24న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో పలు చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉండటంతో 2 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ముఖచిత్రాలు ఏర్పాటు చేశారు.
వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లోనూ నోటాకు అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో మొదటి ఓటరుకు అధికారులు పువ్వు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు, టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, మాజీ చీఫ్ విఫ్ గండ్ర వెంకట రమణా రెడ్డిలు ఓటు వేశారు.