వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్పై సంచలనం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల.. ఇప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాత మిత్రులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ కుటుంబానికి గతంలో సన్నిహితంగా ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు షర్మిల.
షర్మిల పార్టీ నుంచి పిలుపు
ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి అనుంబంధం ఉన్న కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిని కూడా షర్మిల తన పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొండా దంపతులు అనుచరులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత షర్మిల పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు.
వైఎస్ షర్మిల నుంచి డబ్బు వస్తుంది కానీ..
వైఎస్ షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చిందని కొండా మురళీ తెలిపారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీలో చేరబోమని స్పష్టం చేశారు. పార్టీ మారితే వైఎస్ షర్మిల డబ్బు ఇస్తారు కానీ.. తనకు విలువలు ముఖ్యమని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పిన ఆయన.. ఆ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకున్నారు.
వైఎస్ జగన్ కనీసం పలకరించలేదన్న కొండా మురళి
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని కొండా మురళీ తెలిపారు. అయితే, ఆ తర్వా త జగన్ కనీసం తమను పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏబీసీడీలు రాని మంత్రి ఎర్రబెల్లికి అవార్డులు వస్తున్నాయంట అంటు ఎద్దేవా చేశారు. కరోనాతో చావు అంచుల వరకు వెళ్తే టీఆర్ఎస్ సంబరాలు చేసుకుందని మండిపడ్డారు. చంద్రబాబుతోనే తాను ఫైట్ చేశానని.. కేసీఆర్ ఎంత? అంటూ కొండా ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అమ్ముడుపోవద్దని, తాను అండగా ఉంటానని కర్యకర్తలకు కొండా మురళి దంపతులు ధైర్యం చెప్పారు. పార్టీ మారే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేశారు.
ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్లోకి మాధవి రెడ్డి
మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో ఎదురుదెబ్బ తగిలింది. నాగార్జున సాగర్ ఉపఎన్నికల సమయంలో సీనియర్ నేత మాధవి రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాదవి రెడ్డి.. గతంలో పలు పార్టీ బాధ్యతలు నిర్వహించారు. శనివారం మాధవి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల త్వరలో జరగనున్న తరుణంలో తాజా పరిణామాం టీఆర్ఎస్ పార్టీకి కొంత షాకేనని చెప్పవచ్చు.