టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ పథకాలు..: ఎమ్మెల్యే రాజయ్య సంచలనం
వరంగల్: టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంక్షేమ పథకాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసినా.. ముందుగా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
Recommended Video
టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నవారికే ప్రాధాన్యత
టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలంటే.. పార్టీ సభ్యత్వం ఉన్నవారికే పింఛన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూ ఇళ్లు లాంటి పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.
టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాలు, నియోజకవర్గాల వారీగా నేతలకు టార్గెట్లు పెట్టారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కో నియోజకవర్గానికి 50వేల చొప్పున సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా పెట్టడం గమనార్హం.
తన ఆస్పత్రిలోనూ ఆఫర్లు ప్రకటించిన రాజయ్య
ఈ నేపథ్యంలోనే అధినేత ఆదేశాలతో ఎమ్మెల్యేలు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. మాజీ మంత్రి రాజయ్య మాత్రం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రభుత్వం నుంచి అందించే పథకాల్లో పెద్దపేట వేస్తామని చెబుతుండటం గమనార్హం. అంతేగాక, తన సొంత ఆస్పత్రుల్లో వైద్య సేవల పరంగా కూడా ఆఫర్లు ప్రకటించారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటే.. ప్రభుత్వం ద్వారా వచ్చే సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీలు ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. తన సొంత ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చేవారికి 20-30శాతం డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు రాజయ్య. తమ ఆస్పత్రిలో డెలివరీ అయినవారికి ఆడబిడ్డ పుడితే వారి నుంచి ఎలాంటి ఫీజులు తీసుకోబోమని, ఒకవేళ మగబిడ్డ పుడితే వారి నుంచి కేవలం 50 శాతం ఫీజు మాత్రమే తీసుకుంటామన్నారు.
రాజయ్య వ్యాఖ్యల దుమారం
పార్టీ నమోదు కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ నేత రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ప్రజలను బెదిరించి సభ్యత్వ నమోదు చేసుకోవడం ఏంటని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. తమ పార్టీ కేడర్ను మరింత బలోపేతం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అయితే, రాజయ్య వ్యాఖ్యలు మాత్రం టీఆర్ఎస్ సర్కారును కొంత ఇబ్బందికి గురిచేసేవిగా ఉన్నట్లు తెలుస్తోంది.