ఔటాఫ్ కవరేజ్ ఏరియా: తెలుగు రాష్ట్రాల నుంచి దళిత రచయిత పసునూరికి సాహిత్య అకాడమీ
న్యూఢిల్లీ: తెలంగాణలోని వరంగల్కు చెందిన దళిత రచయిత పసునూరి రవీందర్.. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ -2015 అందుకున్నారు. తెలుగు కథా ప్రక్రియ విభాగంలో ఆయన రాసిన 'ఔటాఫ్ కవరేజ్ ఏరియా' కథా సంకలనం పురస్కారానికి ఎంపికైంది.
బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు విశ్వప్రసాద్ తివారి చేతుల మీదుగా ఆయన అవార్డు, తామరపత్రంతో పాటు రూ.50వేల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం రవీందర్ మాట్లాడారు.
23 భఆషల నుంచి 23 మంది యువ రచయితలకు ఈ పురస్కారాలు లభించాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పురస్కారం అందుకోవడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
కాగా, ఈ ఏడాది యువ సాహితీ పురస్కారాల్లో కవితా సంకలనాలకు ప్రాధాన్యం లభించింది. 13 కవితా సంకలనాలు, మూడు నవలలు, ఆరు కథా సంకలనాలు, ఒక సాహితీ విమర్శ పుస్తకం అవార్డుకు ఎంపికయ్యాయి.
సంగీతం, వివిధ భాషల్లో ప్రాచీన మధ్యయుగ సాహిత్య రంగానికి సేవలందించిన ముగ్గురు సాహితీవేత్తలకు కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డులు ప్రకటించింది. 2013 సంవత్సరానికి కే మీనాక్షి సుందరం, 2014లో ఆచార్య మునీశ్వర్ ఝా ఎంపికయ్యారు.
అకాడమీ జాబితాలో లేని భాష కుమౌనీ అభివృద్ధికి కృషి చేసిన చారుచంద్ర పాండే, మథురాదత్తు మథ్పాల్ సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారం కింద వారికి రూ.లక్ష నగదు, తామ్రపత్రం అందుతుంది. సంయుక్తంగా ఎన్నికైన వారికి నగదు బహుమతి సమంగా పంచుతారు. కాగా, సాహితీవేత్త చొక్కాపు వెంకట రమణ సహా వివిధ భాషల్లో 12 మందికి బాల సాహిత్య పురస్కారం ప్రకటించింది.