మాటిచ్చిన బాలకృష్ణ: టీలో ‘పతంజలి’, రాందేవ్-కవిత సమక్షంలో ఎంఓయూ, కేటీఆర్ ప్రశంస
తెలంగాణలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పతంజలి సంస్థ సుముఖత వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పతంజలి సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం హరిద్వార్లో బాబారాందేవ్, ఆచార్య బాలకృష్ణ, టీఆర్ఎస్ ఎంపీ కవిత సమక్షంలో సంస్థ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఏడాది క్రితం నిజామాబాద్లో పరిశ్రమను ఏర్పాటు చేస్తామని బాలకృష్ణ.. ఎంపీ కవితకు హామి ఇచ్చిన విషయం తెలిసిందే.
బాలకృష్ణతోపాటు రాందేవ్ బాబాను కోరిన కవిత
పసుపు ఉత్పత్తిలో ముందజంలో ఉన్న తెలంగాణలో ఆయుర్వేద, ఆహార ఉత్పత్తుల సంస్థను ఏర్పాటు చేయాలని గతంలో ఆచార్య బాలకృష్ణతోపాటు రాందేవ్ను ఎంపీ కవిత కోరారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పతంజలి అంగీకరించింది. ఇక్కడ పసుపు, మిర్చి, మక్కలు, సోయా సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలను శుద్ధి చేసి వాటిని దేశంలోని పతంజలి యూనిట్లకు సరఫరా చేస్తారు.
కవిత కృషి
ఎమ్మెల్యే జీవన్రెడ్డి, తెలంగాణ ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తదితరులు ఎంపీ కవిత బృందంలో ఉన్నారు. అనంతరం సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ ఫుడ్ పార్క్ను 2015 నవంబర్ 15న కేంద్ర మంత్రులు హర్సిమ్రత్ కౌర్ బాదల్, సాధ్వీ నిరంజన్జ్యోతి చేతులమీదుగా ప్రారంభించారు. దీనికోసం అప్పట్లో ఏపీఐఐసీ నుంచి మొత్తం 400 ఎకరాలను సేకరించారు. ఇందులో ప్రస్తుతం 78 ఎకరాల్లో పరిశ్రమలకు అనువుగా అభివృద్ధి చేశారు. ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సరిగ్గా గత ఏడాది పతంజలి గ్రూప్ సీఈవో బాలకృష్ణను స్మార్ట్ ఆగ్రోపార్క్కు రప్పించారు. పసుపు పంట బాగా పండుతుందని తెలుసుకున్న ఆయన పలుచోట్ల తిరిగి పంటను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నాటి నుంచి పతంజలి పరిశ్రమను లక్కంపల్లికి తీసుకువచ్చేందుకు ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే విశేషంగా కృషి చేశారు.
ఎంఓయూతో రైతులకు మేలే
సరిగ్గా ఏడాది తర్వాత పతంజలి తన ఉత్పత్తుల కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు బుధవారం ఎంవోయూ చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాన్ని సీఈ వో బాలకృష్ణ, రాందేవ్ బాబాలు ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిలకు అందజేశారు. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ నెలకొల్పడం వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు రైతులకు మంచి ధర వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురికి ఉపాధి లభించనుంది.
కవితకు కేటీఆర్ అభినందన
ఎమ్మెల్యే జీవన్రెడ్డి, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, నందిపేట్ మండల స్థానిక ప్రజాప్రతినిధులు కవిత నేతృత్వంలో హరిద్వార్ వెళ్లిన ప్రతినిధి బృందంలో ఉన్నారు. హరిద్వార్లోని పతంజలి సంస్థ ఉత్పత్తి కేంద్రాలను, ప్యాకింగ్ యూనిట్లను, పరిశోధనా విభాగాలను, మందుల తయారీ కేంద్రాలను వారు సందర్శించారు. కాగా, తెలంగాణకు పతంజలి యూనిట్ తీసుకొచ్చినందుకు ‘గ్రేట్ జాబ్ కవిత'అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.