ఆస్పత్రి భవనం నాల్గో అంతస్థు నుంచి దూకి రోగి ఆత్మహత్య
హైదరాబాద్: ఓ రోగి అనూహ్యమైన చర్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రి నాల్గో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదులోని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ మోహన్కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.
వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ప్రవీణ్(42) మద్యానికి బానిసయ్యాడు. అతని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. మద్యం అలవాటు మాన్పించేందుకు కుటుంబ సభ్యులు ఈ నెల 24న బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం తన బెడ్పై ఒంటరిగా ఉన్న ప్రవీణ్ ఆస్పత్రి నాల్గో అంతస్తు నుంచి ఆసుపత్రి ప్రాంగణం లోపల దూకి, అక్కడికక్కడే మృతి చెందాడు.
అతను ఆత్మహత్య చేసుకున్న సమయంలో భార్య అక్కడ లేదు. కొద్ది సేపు అతన్ని వదిలేసి తన బంధువును కలవడానికి వెళ్లింది. ఆ సమయంలో ప్రవీణ్ ఆ ఘాతుకానికి ఒడిగట్టాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంలో ప్రవీణ్ భార్య మాధవి వైద్యులు, యాజమాన్యం నిర్లక్ష్యంతో తన భర్త మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.