గద్వాల ఆస్పత్రిలో గ్యాస్ లీక్!: భయంతో రోగుల పరుగులు, ఒకరు మృతి
హైదరాబాద్: జోగులాంబ-గద్వాల జిల్లా ఆస్పత్రిలో గ్యాస్ లీకేజీ వార్తలు రావడంతో ఆస్పత్రిలోని రోగులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి నుంచి పరుగులు తీశారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. బెడ్లపై ఉన్న రోగులను బయటకి తరలించేందుకు వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆస్పత్రిలో ఆస్తమాతో చికిత్స పొందుతున్న కృష్ణయ్య అనే రోగి కూడా ఈ తప్పుడు ప్రచారం కారణంగా కన్నీటిపర్యంతమవుతూ ఆస్పత్రి బయటకి పరుగులు తీశాడు. దీంతో శ్వాస తీసుకోవం ఇబ్బందిగా మారి ప్రాణాలు వదిలాడు. ఆత్మకూరుకు చెందిన కృష్ణయ్య వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. గ్యాస్ లీకేజీ అవుతుందంటూ పరుగులు తీస్తున్న అందరితోపాటు వెళ్లగా.. ప్రాణాలు కోల్పోయాడు.
కాగా, పిల్లల వార్డులోని ఓ ఆక్సిజన్ సిలిండర్ నుంచి పొగలు రావడం గుర్తించిన కొందరు.. గ్యాస్ లీకేజీ అంటూ ప్రచారం చేశారు. అయితే, వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది.. లీకైన సిలిండర్ వాల్వూను సరిచేశారు. దీంతో సమస్య అక్కడికి ముగిసింది. కానీ, కొందరు అనవసరంగా ఆందోళన చెంది.. ఇతర రోగులను ఇబ్బందులకు గురిచేశారు.
ఇది చిన్న ఘటననేని అయితే, రోగులు అనవసరంగా భయాందోళనలకు గురయ్యారని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన ఇటీవల విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనను గుర్తు చేసింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు 30 మంది రోగులు అక్కడే ఉండిపోయారు. పలువురు ప్రమాదం నుంచి బయటపడే ప్రక్రియలో గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు.