హైదరాబాద్ సభలో పవన్ సంచలనం .. కేసీఆర్ ను తిట్టినోళ్ళంతా ఇప్పుడు కేసీఆర్ దగ్గరే ఉన్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన యుద్ధభేరి సభలో కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు .కేసీఆర్ అంటే గౌరవం ఉందని చెప్తూనే ప్రతిపక్ష పార్టీలు లేకుండా చెయ్యాలనే కేసీఆర్ ఆలోచనను తప్పు పట్టారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రస్తుత మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం విబేధాలను పక్కనపెట్టాలన్న పవన్
ఓ ఉద్యమనాయకుడిగా కేసీఆర్ అంటే తమకు అభిమానం ఉందని, ఆంధ్ర ప్రజల కోసం చంద్రబాబుతో విభేదాలను పక్కన పెట్టి కేసీఆర్ పని చెయ్యాలని హితవు పలికారు. కేసీఆర్, చంద్రబాబు మధ్య గొడవలతో ఏపీ ప్రజలు నలిగిపోయారని, ఇంకా వాళ్లను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తాను కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని ఈ వ్యాఖ్యలు చేయడంలేదని తెలిపారు.
ఇప్పుడు టీఆర్ఎస్ లో కీలక నేతలు గతంలో కేసీఆర్ ను తిట్టిన వాళ్లే
ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీ లో ఉన్న నేతలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న నాయకులు చాలా మంది తనముందు కేసీఆర్ ను నోటికొచ్చినట్టు తిట్టిన నాయకులేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో ఉన్న తాజా మంత్రుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ తదితరులు ఒకప్పుడు కేసీఆర్ ను నానామాటలు అన్నవారేనని, నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారని పవన్ వివరించారు.
ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్
టీఆర్ఎస్ నేతలు స్వప్రయోజనాల కోసం పని చేస్తారు అన్న పవన్ కళ్యాణ్
ఇక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ నాయకులు ప్రజల కోసం పనిచేసే వాళ్లు కాదని, తమ స్వంత ప్రయోజనాల కోసం పనిచేసే నేతలని అన్నారు. తెలంగాణ రాగానే సీఎంగా ఓ దళితుడ్ని తీసుకువస్తామని కేసీఆర్ చెప్పినా, ఆ కోరిక నెరవేరలేదని పవన్ పేర్కొన్నారు.మొత్తానికి సున్నితంగా మాట్లాడుతూనే కేసీఆర్ ను అడగాల్సినవి అడిగేశారు పవన్ కళ్యాణ్.