కథువా ఘటనపై పవన్ ఆగ్రహం: నెక్లెస్ రోడ్డులో మౌనదీక్ష, ‘అప్పుడు నేనే కర్రపట్టుకున్నా’
Recommended Video
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్లోని కథువాలో 8ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కథువా అత్యాచార ఘటన హృదయాలను కదిలించిందని అన్నారు.
బాలిక అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం 12 .30గంటలకు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. నిందితులకు అండగా నిలబడటం అంటే రాజద్రోహం చేసినట్లేనని పవన్ వ్యాఖ్యానించారు.
ఆడపిల్లల జోలికొస్తే తోలు తీయాలి
శనివారం ఉదయం అంబేద్కర్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్.. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు కథువా ఘటనపై జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన మహిళా విభాగం ‘వీర మహిళా' ప్రతినిధులు, విద్యార్థులు, యువతీయువకులను ఉద్దేశించి మాట్లాడారు. ఆడపిల్లల జోలికొస్తే తోలు తీయాలంటూ పవన్ వ్యాఖ్యానించారు.
బహిరంగంగా శిక్షించాలి.. సింగపూర్ తరహాలో..
ఈవ్ టీజింగ్, అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలుచేయాలని అన్నారు. సింగపూర్ తరహాలో శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల్ని కాపాడుకునేందుకు హింస తప్పదని అన్నారు. ఆడపిల్లల జోలికొచ్చిన వారిని బహిరంగంగా శిక్షించాలని అన్నారు. సినిమాల ప్రభావంతో మహిళలపై వేధింపులు పెరిగాయన్న అభిప్రాయం సరికాదన్నారు.
వేధింపులు అడ్డుకునేందుకు నేనే కర్ర పట్టా
కొన్నేళ్ల కిందట ఓ షూటింగ్ వెళ్తే 200మంది యూనిట్ సభ్యులు ఉండగానే కొంతమంది బయటివాళ్లు చేరి సినిమాకు సంబంధించిన ఆడపిల్లల్ని వేధించారని.. వాళ్ల నుంచి కాపాడేందుకు తాను కర్ర పట్టుకోవాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. 2004లోలో ఎన్జీఓ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ కలిసి యువతులపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలని వివరించారని, అప్పుడు సాయం అందించినట్లు పవన్ తెలిపారు.
మీడియా సంచలనాల కోసం కాకుండా..
ప్రసార మాధ్యమాలు కథువా లాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సంచలనాత్మకంగా కాకుండా సామాజిక చైతన్యం వచ్చేలా ముందు వెళ్లాలని సూచించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా ప్రాంతంలో ఓ 8ఏళ్ల చిన్నారిపై ఆరుగురు వ్యక్తులు దాదాపు వారం రోజులపాటు మత్తు మందు ఇచ్చి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో 8మంది నిందితులపై పోలీసులు ఛార్జీ షీటు నమోదు చేశారు.