జనసేనలో వారికి కీలక బాధ్యతలు: తెలంగాణలోనూ పవన్ పోటీ పెడ్తారా?
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీకి సంస్ధాగత నిర్మాణం లేదనే విమర్శలకు సమాధానం ఇచ్చారు. పార్టీ ఇంచార్జీలను నియమించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సాగుతున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ చెప్పారు.
ఈ మేరకు జనసేన శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. ఇందులో భాగంగా బొంగునూరి మహేందర్రెడ్డి, నేమూరి శంకర్గౌడ్, పి.హరిప్రసాద్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.
పార్టీ ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షునిగా నియమితులైన మహేందర్రెడ్డి తెలంగాణలో జనసేన రాజకీయ కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు. నేమూరి శంకర్ గౌడ్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. పి.హరిప్రసాద్ పార్టీ మీడియా విభాగానికి సంబంధించిన కార్యకలాపాలు పర్యవేక్షించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
దీన్ని బట్టి తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ రాజకీయాలు నడపాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితవుతారని అందరూ భావిస్తూ వస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యులను నియమించడాన్ని బట్టి ఆయన తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని పోటీకి దించుతారనే అభిప్రాయం ఏర్పడుతుంది.
పవన్ కల్యాణ్ కొత్త సినిమా కూడా శనివారంనాడు ప్రారంభం కావడం విశేషం. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం శనివారం ఉదయం 10:49గంటలకు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలోని దేవాలయంలో జరిగింది. హారిక & హాసిని క్రియేషన్ బ్యానర్పై శ్రీమతి మమత సమర్పణలో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు.