చంద్రబాబు అహంకారం, ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ తెలుస్తుంది: కేటీఆర్, పవన్ కళ్యాణ్కు గ్రీన్ సిగ్నల్!!
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీని 16 స్థానాల్లో గెలిపించి ఢిల్లీని శాసిద్దామని, మన హక్కులు, నిధులు సాధిద్దామని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోమవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి క్రిషాంగ్ తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాదులో మజ్లిస్ను, మిగతా చోట్ల తెరాసను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. తెలంగాణలో జనసేన పోటీ చేయడంపై స్పందించారు.
ఏపీ పాలిటిక్స్పై యూటర్న్: మా పాత్ర ఉండదు.. కేటీఆర్, ఏపీలో జనసేన ప్రభావంపై ఏమన్నారంటే
ఏపీలో జోక్యం చేసుకోం, రిటర్న్ గిఫ్ట్ ఏప్రిల్ 11న తెలుస్తుంది
ఏపీ సీఎం చంద్రబాబును ఇంటికి పంపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు. మేం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏప్రిల్ 11వ తేదీ తర్వాత తెలుస్తుందన్నారు. ఏపీ ఎన్నికలపై ఆసక్తి ఉందా అని ప్రశ్నించగా... మహారాష్ట్ర ఎన్నికలపై ఎంత ఆసక్తి ఉందో ఏపీ ఎన్నికలపై అంతే ఆసక్తి ఉందని చెప్పారు. తద్వారా తమకు తెలంగాణ తప్ప మిగతా రాష్ట్రాలపై ఒకే రకమైన ఆసక్తి అని అభిప్రాయపడ్డారు. ఏపీలో తాము జోక్యం చేసుకోమని చెప్పారు. కేసీఆర్ తన వద్ద పని చేశాడని చంద్రబాబు చెప్పడం అహంకారం అవుతుందన్నారు. మంత్రులు అంటే బానిసలు కారని చెప్పారు. చంద్రబాబుకు కనీసం ఇంగితజ్ఞానం లేదన్నారు.
పవన్ కళ్యాణ్కు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్!
కాంగ్రెస్ పార్టీ కేబినెట్లో చంద్రబాబు పని చేయలేదా అని కేటీఆర్ నిలదీశారు. చంద్రబాబు తానే తెలుగుదేశం పార్టీని స్థాపించినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అన్నారు. మళ్లీ అవకాశం వస్తే నరేంద్ర మోడీ సర్కారులో కూడా చేరుతాడని, అలాంటి వ్యక్తి అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే తప్పేముందని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా ప్రచారం చేసుకోవచ్చునని చెప్పారు. ఏపీలో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ల మధ్య త్రిముఖ పోరు నెలకొని ఉందన్నారు.
మా ఎంపీలను తీసుకోలేదా?
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫిరాయింపు ఆరోపణల్లో ఎలాంటి అర్థం లేదని కేటీఆర్ అన్నారు. 2014లో తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ విశ్వేశ్వర రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కండువా కప్పారన్నారు. తమ ఎంపీ డీ శ్రీనివాస్ను తీసుకోలేదా అని ప్రశ్నించారు. గతంలో మా పార్టీ నుంచి చాలామందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారన్నారు. జరుగుతున్న పరిణామాలపై ప్రజలే తీర్పు ఇస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు ఎందుకు కదులుతున్నాయో వారే ఆలోచించుకోవాలని చెప్పారు. అసలు కాంగ్రెస్ బస్సు యాత్ర దేనికి అని ప్రశ్నించారు.
ప్రజలు ఆలోచించాలి
యూపీఏ హయాంలో ఎవరు రైల్వే శాఖ మంత్రిగా ఉంటే ఆ రాష్ట్రానికే రైళ్లన్నీ వెళ్లాయన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక గుజరాత్, మహారాష్ట్రల మధ్య బుల్లెట్ రైలు అంటున్నారని, హైదరాబాద్కు ఆ రైలు వద్దా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెరాస 16 మంది ఎంపీలకు మరో వంద మందిని జత చేసుకుంటే హైదరాబాదుకు బుల్లెట్ రైలు పరుగెత్తుకుంటూ వస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి బుల్లెట్ రైలు వద్దా అన్నారు. దేశంలో రాహుల్, ప్రధాని ఇద్దరే ఉన్నారా అని నిలదీశారు. జాతీయ పార్టీలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయన్నారు. తెరాసను స్థాపించి తెలంగాణ స్వప్నాన్ని సాధిస్తానని కేసీఆర్ పిలుపునిచ్చినప్పుడు అనేకమంది హేళన చేస్తూ మాట్లాడారని, వారి నోళ్లు మూతపడేలా ఇద్దరే ఎంపీలతో 2009లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను సాధించారని, అలాంటి కేసీఆర్ చేతిలో పదహారు మంది ఎంపీలు ఉంటే ఎంత అభిఅభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు. ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గల్లంతయ్యాయన్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, తెలంగాణకు అడిగినా ఇవ్వలేదన్నారు.