ద్వేషిస్తే నో టైం, మీకు వ్యతిరేకంకాదు: జై తెలంగాణ అంటూ పవన్ ఉద్వేగం, దేశ విభజనపై ఇలా
కరీంనగర్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం రెండో రోజు పర్యటిస్తున్నారు. ఆయన ఉదయం శ్వేత హోటల్ నుంచి శుభం గార్డెన్ చేరుకున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన జై తెలంగాణ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు.
Recommended Video
ఆంధ్రప్రదేశ్ తనకు జన్మను ఇస్తే తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని చెప్పారు. 2009లో కొండగట్టు అంజన్న తనను కాపాడారని, అందుకే ఈ గడ్డపై నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని, తెలంగాణకు తాను చివరి శ్వాస వరకు రుణపడి ఉంటానని చెప్పారు. వందేమాతరం లాగే జై తెలంగాణ నినాదం నా అణువణువునా ఉందన్నారు.
సీఎం అంటూ నినాదాలు
జై తెలంగాణ అంటే ఏమిటని అడుగుతారేమో.. చీకటి నుంచి స్వేచ్ఛ వైపు తీసుకు వచ్చిన నినాదమే జై తెలంగాణ అని అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతుండగా అభిమానులు సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అభిమానులు ఉత్సహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి తెలంగాణ నుంచి జనసేన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడం తనకు ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.
తెలంగాణ భావోద్వేగం నాకు దగ్గరగా ఉంటుంది
భారత దేశంలో కులాలను విస్మరించి రాజకీయాలు చేయలేమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్ని కులాలను గౌరవించాలన్నారు. తాను 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. నాడు తాము సామాజిక తెలంగాణలో సిద్ధంగా ఉన్నామని అప్పుడు చెప్పామని గుర్తు చేశారు. తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అన్నారు. తెలంగాణ భావోద్వేగం తనకు దగ్గరగా ఉంటుందన్నారు.
తెలంగాణ వ్యతిరేకిని కాను, ఇష్టం.. ఇష్టం
తాను తెలంగాణ వ్యతిరేకిని కాదని పవన్ చెప్పారు. తెలంగాణ అంటే తనకు ప్రేమ, ప్రాణం అన్నారు. మీరు నా సినిమాలు చూసినా మీకు అర్థమవుతుందన్నారు. తన సినిమాల్లో తెలంగాణ యాస, భాష, సంస్కృతి ఉంటాయన్నారు. తనకు తెలంగాణ పోరాటంలో గద్దర్ ఇష్టమని చెప్పారు. పాలకులు చేసే దానిని ఆంధ్రా ప్రజల మీదకు రుద్దవద్దని తాను గద్దర్తో చెబితే, ఆయన అంగీకరించారని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి తాను ఈ విజ్ఞప్తి చేశానన్నారు.
నన్ను ద్వేషించే వారికి టైం లేదు
తనను ద్వేషించే వారి గురించి ఆలోచించేందుకు తనకు సమయం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను ప్రేమించే వాళ్లకే సమయం కేటాయిస్తానని చెప్పారు. నన్ను ద్వేషించే వాళ్లను ద్వేషించనివ్వండని, తనకు ఇబ్బంది లేదన్నారు. తనకు ఏ ఒక్కరితో గొడవలు లేవని చెప్పారు. విధివిధానాలతోనే పోరాటం అని చెప్పారు. భాషలను గౌరవించే, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, కుల,మతాలు లేని రాజకీయం తనకు కావాలన్నారు. అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటమే తమ లక్ష్యమన్నారు.
భారత్ విభజన జరిగినప్పుడు
అఖండ భారత్ విడిపోయినప్పుడు.. పాకిస్తాన్ ముస్లీం దేశంగా విడిపోయినప్పుడు, భారత్ హిందూ దేశంగా కొందరు చెప్పారని, కానీ మన నాయకులు మాత్రం తమది సెక్యులర్ దేశమని చెప్పారని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే లౌకికవాద దేశంగా మనది మిగిలిపోయిందన్నారు. కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు జనసేన లక్ష్యమని చెప్పారు. సామాజిక న్యాయం అంటే సీట్లు ఇవ్వడం కాదని, ఫలాలు అందడం అన్నారు.
మీ కోసం.. మీ బాధల కోసం నేనున్నా
రాజకీయం కొన్ని కులాలకే పరిమితం అయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు హిందీ, ఉర్దూ కూడా ఇష్టమని, తాను వాటిని ఇష్టపడి నేర్చుకున్నానని, కానీ బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. బతుకమ్మ, సదర్, సమ్మక్క సారక్క మన పండుగలు అన్నారు. ప్రాంతీయతను గౌరవించకుంటే విబేధాలు వస్తాయన్నారు. మీ కోసం.. మీ బాధల కోసం నేను ఉన్నానని చెప్పారు.
ఆంధ్రా-తెలంగాణ వేరు కాదు, నా గుండె కొట్టుకుంటోంది
ఆంధ్రా, తెలంగాణ వేరు అయినా తెలంగాణ నాలుగేళ్ల పసిగుడ్డు అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాల్లో కొత్త రక్తం రావాలన్నారు. ఆంధ్రా, తెలంగాణ వేరు కాదని, దేశం కోసం నా గుండె కొట్టుకుంటుందని చెప్పారు. కొందరు జనసేన విలీనం గురించి అడిగారని, విలీనం చేయాలనుకుంటే మీ ముందు ఎందుకు ఉంటానని ప్రశ్నించారు. 2019లో పోటీ చేస్తామని చెప్పారు.