కుమారస్వామితో భేటీ: 'పవన్! ముందు నీ రాష్ట్రం గురించి చూసుకో'
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు సోమవారం నాడు సూచనలు చేశారు. ముందు నీ సొంత రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించుకుంటే మంచిదని, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల పైన దృష్టి సారించవచ్చునని అన్నారు.
పవన్ కళ్యాణ్తో ఇటీవల కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విహెచ్ స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా, తూర్పు కాపులను బీసీల నుంచి తొలగించడం పైన పవన్ కళ్యాణ్ మాట్లాడక పోవడం సిగ్గుచేటు అన్నారు.
పవన్ కళ్యాణ్తో కుమారస్వామి భేటీ కావడంపై స్పందిస్తూ.. కర్ణాటకలోని ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని వీహెచ్ చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలని గతంలో కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదన్నారు.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కాలయాపన చేయకుండా ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తే మంచిదన్నారు. అప్పుడు రాష్ట్రానికి తొంబై శాతం నిధులు వస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక నిధులు కేటాయించి, వచ్చే ఒలింపిక్స్లోనైనా మంచి ఫలితాలు వచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నారు.