వీరుల త్యాగాలు గుర్తుచేసుకొని, కలలు సాకారం చేయాలి, బాధ్యత వారిదే: తెలంగాణపై పవన్
హైదరాబాద్/విజయనగరం: జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందరూ కలిసి తెలంగాణను సుసంపన్నం చేసుకోవాలని జనసేనాని అన్నారు.
తెలంగాణపై మరిన్ని కథనాలు చదవండి
కోట్లమంది ఆశయ సాధన ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం నాలుగో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసుకొంటున్న శుభతరుణంలో తెలంగాణ ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఆరున్నర దశాబ్దాల పోరాటంతో సిద్ధించిన ఈ రాష్ట్రం సుసంపన్నం కావాలంటే అందరూ కలసికట్టుగా పని చేయాలన్నారు. వందలమంది పోరాటయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు.
ఆ వీరుల త్యాగాలను ఎల్లవేళలా గుర్తుచేసుకుంటూ వారి కలలని సాకారం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పాడిపంటల్లో, పరిశ్రమల్లో, ఉపాధి ఉద్యోగ కల్పనలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.