వ్యతిరేకించినంత మాత్రానా.. రోహిత్ను బీజేపీ వేధించాలా?: పవన్
బీజేపీ సహా దాని అనుకూల పార్టీలన్ని 'రోహిత్ దళితుడు కాదు' అన్న విషయాన్ని నిరూపించడానికే ఆరాటపడ్డాయని పవన్ తెలిపారు.
హైదరాబాద్: హెచ్.సి.యూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు రోహిత్ వేముల ఆత్మహత్యకు కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయలే కారణమంటూ అప్పట్లో ఆందోళనలు చేశారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే వర్సిటీల్లో రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తాజాగా ఈ విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అంతకుముందు గురువారం నాడు గోవధ అంశంపై స్పందించిన పవన్.. రోహిత్ వేముల ఆత్మహత్యపై శుక్రవారం నాడు స్పందిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
బీజేపీ వ్యక్తిగతంగా తీసుకుంది!:
రోహిత్ బీజేపీని వ్యతిరేకించినంత మాత్రానా బీజేపీ అతడిని వేధించాలా?, ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది అని పవన్ తెలిపారు. రోహిత్ అంశాన్ని బీజేపీ వ్యక్తిగతంగా తీసుకుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.రోహిత్ వేముల ఆత్మహత్యను రాజకీయ పార్టీలన్ని కలిసి రాజకీయం చేశాయని అభిప్రాయపడ్డారు.
యుద్దరంగంగా యూనివర్సిటీలు:
యూనివర్సిటీలు ఎకడమిక్ చదువుల కన్నా రాజకీయ పార్టీలకు యుద్దరంగంగా మారుతున్నాయని పవన్ పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్ని రోహిత్ వేముల ఆత్మహత్యను తమ పొలిటికల్ మైలేజీ కోసం వాడుకుంటే.. బీజేపీ సహా దాని అనుకూల పార్టీలన్ని 'రోహిత్ దళితుడు కాదు' అన్న విషయాన్ని నిరూపించడానికే ఆరాటపడ్డాయని పవన్ తెలిపారు.
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2016
ఇకముందైనా ఇలా జరగకుండా:
భవిష్యత్తులో అయినా రోహిత్ వేముల లాంటి మేదావి విద్యార్థులు ఆత్యహత్యలకు పాల్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పవన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సరైన కౌన్సెలింగ్ గనుక ఇచ్చి ఉంటే ప్రకృతి ఫిలాసఫర్, మేదావి అయిన రోహిత్ వేముల ప్రాణాలు నిలబడి ఉండేవని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2016
సస్పెండ్ చేయడం వల్లే:
యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయడం, క్యాంపస్ నుంచి కూడా వెళ్లిపోవాలని వర్సిటీ అధికారులు ఆదేశించడంతో రోహిత్ తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యాడని, ఇవన్నీ కలిసి అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పాయని పవన్ పేర్కొన్నారు. ఆ సమయంలో సొంత వ్యక్తుల నుంచి కూడా రోహిత్ కు నైతిక మద్దతు లభించలేదన్నారు. కేంద్రం రోహిత్ విషయంలో నేరుగా జోక్యం చేసుకోవడం, అతనికి సరౌన కౌన్సెలింగ్ అందకపోవడం బాధాకరమన్నారు.