అడగను: రామ్ చరణ్ వ్యాఖ్యలపై పవన్, ఇక్కడున్నది కత్తులు దూసే యువత, ఆయనకు డబ్బుంది కాబట్టి తాగుతారు
శ్రీకాకుళం: తన బాబాయి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆహ్వానిస్తే తాను సిద్ధమని ఇటీవల నటుడు రామ్ చరణ్ తేజ ప్రకటించారు. దీనిపై జనసేనాని ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఎవరైనా స్వతహాగా వస్తే తాను పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పారు.
Recommended Video
అంతే తప్ప తన కుటుంబ సభ్యులను పార్టీలోకి రమ్మని, పార్టీకి ప్రచారం చేయమని తాను అడగబోనని తేల్చి చెప్పారు. అంతేకాదు, వారు వస్తానని చెప్పినా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోమని చెబుతానని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా నిబద్ధత ఉండాలన్నారు. ఇష్టపడి రావాలని చెప్పారు.
చదవండి: జనసేనకు ప్రచారం చేస్తా, అప్పుడు బాబాయి పవన్ కళ్యాణ్ వద్దన్నారు: రామ్ చరణ్ తేజ
వారికి ఇబ్బంది ఎందుకు, ఇంతకుమించి ఎక్కువ మాట్లాడను
నా కుటుంబ సభ్యులు సినిమాలతో బిజీగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాలు ముళ్లవంటివని అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు వారికి ఇబ్బందులు ఎందుకు అని తాను భావిస్తానని చెప్పారు. ఇంతకుమించి దీని గురించి ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.
మోడీ గారూ! గుజరాత్లో పెట్టుకోవచ్చు కదా
కాగా, పవన్ శ్రీకాకుళం జిల్లా యాత్రలో ఉన్నారు. ఆయన పట్టణంలోని ఏడు రోడ్ల కూడలిలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాన్ని గుజరాత్లో పెట్టుకోవచ్చు కదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అణు విద్యుత్ కేంద్రాలకు శ్రీకాకుళం కావాలి కానీ అభివృద్ధికి, ఉద్యోగాలకు వద్దా అన్నారు. ఇలాంటి విద్యుత్ కేంద్రం వల్ల ఉపద్రవం వస్తే ఏమీ మిగలదన్నారు. ఉద్దానంలో మేం చేయాల్సినవి అన్ని చేశామని చంద్రబాబు అంటున్నారని, అయితే సరైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. ఇసుక మాఫియా మీద ఉండే ఆసక్తి ఉద్దానం కిడ్నీ సమస్యలపై ఎందుకు పెట్టడం లేదన్నారు. ఇసుకను చూస్తే కరకరా నమిలేస్తున్నారన్నారు. ఇసుక దోపిడీకి నదులు బావురుమంటున్నాయన్నారు.
సాయం చేసిన చేతులను నరికే రకం
ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాలను సమానంగా చూడాలని పవన్ సూచించారు. టీడీపీని నమ్ముకున్నవారికే అమరావతి ప్రాంతమని, అది సామాన్యులకు కాదన్నారు. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించ వద్దన్నారు. జన్మభూమి కమిటీల పేరు మీద పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన సైనికులను వాడుకొని అధికారంలోకి వచ్చారని, సాయం చేసిన చేతులను నరికివేసే తత్వం టీడీపీది అన్నారు.
ఉత్తరాంధ్ర నాయకులమని చెప్పుకుంటున్నారు సరే
మన యాస, భాషను గౌరవించే ప్రభుత్వం కావాలని పవన్ అన్నారు. ఈ పాలకులకి మన శ్రీకాకుళం అంటే చిన్న చూపు అని, ఇక్కడి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తరాంధ్ర నాయకులమని చెప్పుకొనే అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి రాజు, బొత్స సత్యనారాయణలు ఉద్ధానం సమస్యని ఇన్నేళ్లుగా ఎందుకు పట్టించుకోలేదన్నారు. రెండు దశాబ్దాల్లో 40 వేల మంది చనిపోయినా వీరిలో కదలిక రాదా? మరోవైపు భూగర్భ జలాల్ని కలుషితం చేసే పరిశ్రమల్ని ఇక్కడ పెట్టిస్తున్నారన్నారు. ప్రజలకు రక్షిత మంచినీరు దక్కనీయరా అన్నారు.
బాబూ! సన్మానాలు చేసింది మీరే
పరిస్థితి ఏమిటని పవన్ ప్రశ్నించారు. హోదా విషయంలో చంద్రపబాబు మూడేళ్ళలో 36 సార్లు మాట మార్చారని, బీజేపీ వాళ్లు హోదా అనేది గడచిన అధ్యాయం అంటారని, అటువంటి వారిని అంబారీలు ఎక్కించి, అమరావతిలో సన్మానాలు చేసింది టీడీపీ వాళ్లే అన్నారు. సన్మానాలు చేసి కాంట్రాక్టులు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రానికి మాత్రం హోదా సాధించలేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏ మూలకి వెళ్లినా అధికార పార్టీ వాళ్ల భూ కబ్జాలు, ఇసుక దోపిడీ గురించే మాట్లాడుతున్నారన్నారు.
మా పార్టీ ఆఫీస్కు వచ్చావుగా, ఇక్కడ ఉంది కత్తులు దూసే యువత
ప్రత్యేక హోదా గురించి రెండేళ్ల క్రితం మాట్లాడితే.. అప్పుడు చంద్రబాబు అది సంజీవని కాదన్నారని పవన్ గుర్తుచేశారు. ఇప్పుడేమో మాటమార్చుతున్నారన్నారు. ప్రత్యేక హోదాపై జనసేన ఎప్పుడూ మాటమార్చలేదన్నారు. జనసేనకు బలం లేదని చంద్రబాబు అంటున్నారని, మరి గత ఎన్నికలకు ముందు హైదరాబాద్లోని మన పార్టీ ఆఫీస్కి వచ్చి మరీ మద్దతు అడిగారని, చంద్రబాబుది ఏరు దాటాకా తెప్ప తగలేసే రకమన్నారు. మీ మాటలు, కథలు వినేందుకు ఇక్కడ ఎవరూ పాత తరంవాళ్లు లేరని, ఇక్కడ ఉన్నది కత్తులు దూసే యువత అని గుర్తు పెట్టుకోవాలన్నారు. టీడీపీకి తాను సాయం చేశానని, కాని వారి నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు.