ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. కేసీఆర్ కు విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలు పోయాయని బాధలో పలువురు గుండెపోటుతో మృతిచెందగా, మరి కొందరు ఆత్మహత్యల బాట పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ కార్మికుల కోసం ప్రాణత్యాగం చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తొలగించామని, ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తామని చేసిన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత పెరిగింది.
తమ డిమాండ్లను పరిష్కరించకుండా, కనీసం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ కార్మికులకు ఏమాత్రం రుచించడం లేదు. ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చడం, ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సంక్షోభాన్ని మరింత పెంచింది.
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మ బలిదానం తీవ్రంగా కలచివేస్తుంది. కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం - జనసేన అధినేత #PawanKalyan#TSRTCStrike #JanaSena #JSPWithTSRTCemployees pic.twitter.com/Mym3GCnZBU
— JanaSena Party (@JanaSenaParty) October 13, 2019
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖమ్మం జిల్లా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి ప్రాణత్యాగం తనను ఎంతో బాధించిందని ట్వీట్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లోకి నెట్టకుండా ఉండాల్సిందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి పవన్ హితవు పలికారు.
ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్యలకు పురిగొల్పు తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ సంక్షోభానికి ప్రభుత్వం ముగింపు పలకాలని తెలంగాణ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. ఆర్టిసి కార్మికుల సమ్మె ప్రారంభమైన తొలి రోజుల్లోనే స్పందించిన ఆయన తెలంగాణ ఆర్టీసీ లో కార్మికుల తొలగింపు ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కార్మికులు చేసే ఆందోళన సానుభూతితో అర్థం చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించటానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజులపాటు ఆర్టీసి ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమానికి అండగా ఉన్నారన్న విషయం గుర్తు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరించారని సీఎం కేసీఆర్ ను కోరారు పవన్ కళ్యాణ్. కానీ సీఎం కేసీఆర్ ఎవరి సలహాలు సూచనలు తీసుకునే స్థితిలో లేరు .