చిరంజీవే ఉన్నాడు, అవసరమైతే గొడవ పెట్టుకుంటా: విజయశాంతికి పవన్ కళ్యాణ్ కౌంటర్!
కరీంనగర్: తన అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకుడేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన తెలంగాణ చలోరే చల్ పర్యటన రెండో రోజైన మంగళవారం కరీంనగర్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన విమర్శలపై స్పందించారు.
Recommended Video
తెలంగాణకు వ్యతిరేకం కాదు.. ఇష్టం.. ఇష్టం: పవన్ కళ్యాణ్ ఉద్వేగం
తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిస్తే, ప్రశంసిస్తే కొందరు కాంగ్రెస్ నాయకులు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తాను ఏ పార్టీకి, ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నారని చెప్పారు. ఆంధ్రా వ్యక్తి తెలంగాణలో ఎలా తిరుగుతారని ప్రశ్నించడం సరికాదన్నారు.
చిరంజీవితో సంబంధం లేదని చెప్పిన కాసేపటికే.. పవన్ కళ్యాణ్పై రామ్ చరణ్ ఇలా!
కేసీఆర్ అంటే మొదటి నుంచి ఇష్టం
కేసీఆర్ అంటే తనకు ముందు నుంచి ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల కోసం పోరాడే ఏ వ్యక్తిని అయినా తాను గౌరవిస్తానని చెప్పారు. అందులో భాగంగా కేసీఆర్ను ఇష్టపడుతున్నానని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా విభేదించడం వేరు అన్నారు. తెలంగాణ అనే నాలుగేళ్ల పసిగుడ్డును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాను కాంగ్రెస్ నేతలకు చెబుతున్నానని అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ పోరాటం చేసే వారిని గౌరవిస్తానని చెప్పారు.
అవసరమైతే గొడవ పెట్టుకుంటా
తాను తెలుగు ప్రజల కోసం పోరాడుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజా సమస్యలపై విభేదిస్తానని, అవసరమైతే గొడవ పెట్టుకుంటానని చెప్పారు. సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్తానని, పరిష్కారం సూచిస్తానని చెప్పారు. పరిష్కారం కుదరకుంటే పోరాడుతానని చెప్పారు. ఏడు సిద్ధాంతాలతో జనసేన ముందుకు పోతోందన్నారు.
యుద్ధం చేస్తే తెలంగాణ వచ్చింది, ఇదీ జనసేన ఆకాంక్ష
తెలంగాణ ఒక్కసారిగా రాలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. దశాబ్దాల పోరాటం తర్వాత వచ్చిందన్నారు. యుద్ధం చేసి సాధించుకున్నారని చెప్పారు. మన యాస, భాష, సంస్కృతిని గౌరవించే రాజకీయం కావాలన్నారు. అందరికీ ఆహార భద్రత ముఖ్యమన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం జనసేన చేస్తుందన్నారు. అన్ని వర్గాలకు, అణగారిన వర్గాలకు ఆహార భద్రత ముఖ్యమన్నారు. తెలంగాణ ఆకాంక్షే జనసేన ఆకాంక్ష అని, ఆడపడుచుల ఆకాంక్షే జనసేన ఆకాంక్ష అని, ఏ తెలంగాణ కోసం పోరాడారో దాని కోసం నిలబడటమే జనసేన ఆకాంక్ష అని పవన్ అన్నారు.
రోడ్డు మీదకు వస్తా, ఇక పార్టీ పెట్టడం ఎందుకు
అవసరమైతే తాను తెలంగాణ ప్రజల కోసం రోడ్డు మీదకు వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కొన్ని సందర్భాలల్లో తాను రాజీపడినట్లుగా ఉంటుందని, కానీ అలాంటి పరిస్థితే లేదన్నారు. కొందరు పార్టీని విలీనం చేయమని అడిగారని, అలాంటప్పుడు పార్టీ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. 2019లో బలం చూసుకొని పోటీ చేస్తానని చెప్పారు. తనకు పునర్జన్మను ఇచ్చిన తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
రాజీపడను, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఈ ప్రేమ దొరకదు
తాను ఎవరితోను రాజీపడనని, తనకు డబ్బు అవసరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా మీలాంటి ప్రేమ దొరకదని చెప్పారు. ఈ ప్రేమకు మించి తనకు ఏదీ లేదన్నారు. ఈ తెలంగాణ తల్లికి సేవ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. ఆ భాగ్యం నాకు కావాలన్నారు. సేవ చేసే అవకాశం అంటే తాను పదవి కోరుకోవడం లేదన్నారు. ఏ తెలంగాణ కోసమైతే పోరాటం జరిగిందో ఆ ఆశయ సాధన కోసం నేను కూడా మీలా సైనికుడిలా, సేవకుడిలా పోరాటం చేస్తానని చెప్పారు. 2019లో తెలంగాణలో జనసేన బోణీ కొడుతుందన్నారు. తనకు అండగా నిలబడాలని, మడమ తిప్పనని చెప్పారు.
విజయశాంతి సహా వారికి గట్టి కౌంటర్
పవన్ కళ్యాణ్ యాత్రపై కాంగ్రెస్ నేతలు విజయశాంతి, పొన్నం ప్రభాకర్, బీజేపీ నేత కృష్ణసాగర్ తదితరులు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ జవాబిచ్చారు. సకల జనుల సమ్మె సమయంలో పవన్ను టూరిస్ట్ అని కామెంట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో ఆయనకు ఎలా అనుమతి ఇచ్చారని విజయశాంతి నిలదీశారు. టూరిస్ట్కు ఇచ్చిన స్వేచ్ఛ, ఉద్యమనేతలకు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. జేఏసీ నేతలను నిర్బంధిస్తున్నారన్నారు. దీనిపై పవన్ మాట్లాడుతూ.. తనకు ఏపీ జన్మను ఇస్తే తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని, తనకు రెండు రాష్ట్రాలు సమానమని, ఏపీ తెలంగాణ వేరు కాదని, తన గుండె దేశం కోసం కొట్టుకుంటుందని గట్టి కౌంటర్ ఇచ్చారు.