సీమాంధ్ర ఉద్యమం లీడ్ చేయమంటే: తెలంగాణపై పవన్, ఏయ్ ఎక్కువచేయకు..ఫ్యాన్స్పై అరిచారు
హైదరాబాద్: జనసేన పార్టీ కేవలం ఏపీకి పరిమితం కాదని, తెలంగాణకూ చెందినదని, ఎక్కడ తెలుగువారు ఉంటే వారి పార్టీ అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం చెప్పారు. 'ఆత్మీయ సదస్సు' పేరుతో హైదరాబాదులోని సంధ్య కన్వెన్షన్ హాలులో మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
Recommended Video
జగన్ గెలిస్తే ఏం చేస్తాడో భయంగా ఉందని బాబు ఇంటికి పిలిచి చెప్పారు: పవన్ షాకింగ్
సమైక్యత కోసం జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. పని చేసుకుంటూ వెళ్తే అధికారం నీ వెంట రావాలి తప్ప, అధికారం కోసం పరుగెత్తవద్దని, అదే జనసేన సిద్ధాంతమన్నారు. సినిమాలలోను నేను కలలు కనలేదని చెప్పారు. కర్మయోగాన్ని నమ్ముతానని చెప్పారు. నీ క్యారెక్టర్, నీ సామర్థ్యం ఆధారంగా నీకు పేరు వస్తుందన్నారు. ఎదగాడనికి ఎందుకురా తొందర.. నీ బతుకంతా చిందరవందర అనే సామెతను గుర్తు చేశారు.
2009లో పోటీ చేసే అవకాశమున్నా చేయలేదు
2009లోనే తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమున్నా చేయలేదని పవన్ చెప్పారు. కానీ రాజకీయాలను క్షుణ్ణంగా సంపూర్ణంగా అవగాహన చేసుకునేందుకు ఆగిపోయానని చెప్పారు. అలా చేయకుండా హడావుడిగా రాజకీయాల్లోకి వస్తే ఆత్మహత్యా సదృశ్యం అవుతుందన్నారు. అందుకే నేను ఆలోచించి మాట్లాడుతానని చెప్పారు. ప్రతిది ఆలోచించి, ఆచితూచి మాట్లాడుతానని చెప్పారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లీడ్ చేయమన్నారు
నన్ను సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లీడ్ చేయమని తనకు కొందరు చెప్పారని పవన్ అన్నారు. కానీ నేను లీడ్ చేయలేదన్నారు. తెలంగాణలో తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారన్నారు. నేను ఎప్పుడు మనుషులను కలిపే మాట మాట్లాడుతానని చెప్పారు. అలా చేస్తే ఇబ్బందులు ఉంటాయని, అయినా రాలేదన్నారు. గద్దర్ మాటల నుంచి, జోగినీ వ్యవస్థ గురించి, కవి, గొప్ప గాయకుడు మాస్టర్జీ నుంచి తనకు తెలంగాణ తెలుసునని చెప్పారు. జానపద గేయాల ద్వారా మనకు కష్టాలు తెలుస్తాయన్నారు.
తెలంగాణ కష్టాల గురించి ఏం తెలుసునని అడిగితే
తెలంగాణ కష్టాల గురించి మీకేం తెలుసునని ఓయు వారు అడిగితే, నేను జోగనీ వ్యవస్థ గురించి కవిత చెప్పానని పవన్ గుర్తు చేశారు. నటుడిగా నాకు ఉన్న అదృష్టం ఏమంటే.. కళాకారుడిగా నేను వైరుధ్యాలను అర్థం చేసుకొని లష్కర్, సదర్ పండుగ వంటివి కూడా పెట్టానని చెప్పారు. తాను అన్నింటిని అర్థం చేసుకున్నానని చెప్పేందుకే తన సినిమాల్లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన అంశాలను పెట్టానని చెప్పారు. కళాకారుడు రాజకీయాల్లోకి వస్తే ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ వైరుధ్యాలు అర్థం చేసుకోగలరన్నారు.
చిరంజీవికి మనస్ఫూర్తిగా నమస్కారం
అలాంటి కళాకారుడిగా నేను అయ్యానంటే అందుకు చిరంజీవి కారణం అని పవన్ అన్నారు. అందుకు తాను చిరంజీవికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నానని చెప్పారు. తాను 2007లో కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే, ఇలాంటి సభ పెట్టేందుకు దశాబ్దం పట్టిందన్నారు. సినిమాల్లో కోట్లు సంపాదించవచ్చునని, పండుగలు, పబ్బాలు చేసుకోవచ్చునని చెప్పారు. కానీ సినిమాలను తాను వృత్తిగా చూశానని, నా ప్రవృత్తి సమాజసేవ అన్నారు. నేను ఏ రోజు కూడా బాధ్యత, క్రమం తప్పలేదన్నారు.
నరేంద్ర మోడీ తెలుసు, ఏం కావాలని అడిగితే
ప్రధాని నరేంద్ర మోడీ తనకు స్వయంగా తెలుసునని, ఆయన ఏం కావాలని తనను అడిగారని, దేశ సమగ్రతను కాపాడమని కోరానని పవన్ చెప్పారు. ఈ దేశం కోసం, ఈ నేల కోసం, ఈ ప్రజల కోసం ప్రాణత్యాగానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని, అందులో నేను ఒకడినని పవన్ చెప్పారు. నేను యువతను రెచ్చగొట్టనని చెప్పారు. స్వాతంత్ర ఉద్యమం సమయంలో నాయకులు కష్టపడ్డారని, కానీ ఇప్పటి నాయకులు మాత్రం ప్రజలు, కార్యకర్తలు త్యాగాలు చేస్తే, నాయకులు అందలం ఎక్కుతారన్నారు. నేను దానికి వ్యతిరేకం చెప్పారు.
బాధ్యతతో రాజకీయాలు చేస్తా
విశాఖ రైల్వే జోన్ కోసం నాయకులు ప్రధాని మోడీతో గొడవ పడాలని పవన్ అన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో యువత క్షేమంగా ఉండాలన్నారు. అందుకే తాను యువతను త్యాగం చేయమని చెప్పనని, అవసరమైతే నేను త్యాగం చేస్తానని చెప్పారు. యువత నా వెంట ఉంటే చాలన్నారు. నేను యువతను తప్పుదోవ పట్టించనని చెప్పారు. నేను మధ్యతరగతి నుంచి వచ్చానని, కాబట్టి బాధ్యతతో రాజకీయాలు నిర్వర్తిస్తానని చెప్పారు. నా రాజకీయాలు కొత్తగా ఉంటాయన్నారు. నేను 2007లో కామన్ ప్రొటక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు వెటకారం చేసినవారు ఉన్నారని చెప్పారు. నేను ఎప్పుడూ దారి తప్పనని చెప్పారు.
వెనక్కి వెళ్లాలని పదేపదే విజ్ఞప్తి
పవన్ వేదిక పైకి వచ్చినప్పటి నుంచి మొదలు అభిమానులు, కార్యకర్తలు.. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. పలువురు పదేపదే స్టేజి పైకి వస్తుండటంతో పవన్ పలుమార్లు వారిని వెనక్కి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నేను అందరినీ పిలుస్తానని, దయచేసి ముందుకు రావొద్దని, ఇబ్బంది అవుతుందని చెప్పారు. అందరూ లైన్లో నిల్చుంటే నేనే అక్కడకు వస్తానని చెప్పారు. ఆ తర్వాత తోట చంద్రశేఖర రావు, మాదాసులు.. అందరికీ కండువాలు వేయాలని కోరారు. అంతకుముందు, నూర్ మహమ్మద్ను (హైదరాబాద్), ఏడిద శ్రీనివాస రావును (అమలాపురం) తదితరులను జనసేనలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఏయ్.. అరవకు అని అభిమానులకు జనసేనాని హెచ్చరిక
అభిమానులు పదేపదే సీఎం.. సీఎం అని నినాదాలు చేస్తుంటే ఆయన వారిని హెచ్చరించారు. ఉత్సాహం ఉండవచ్చు కానీ, అత్యుత్సాహం క్రమశిక్షణారాహిత్యానికి దారితీస్తుందని చెప్పారు. పదేపదే ఇలా చేయడం సరికాదన్నారు. క్రమపద్ధతి అనేది ఉండాలన్నారు. మీ అభిమానం సంతోషమే అయినప్పటికీ అత్యుత్సాహం సరికాదన్నారు. జెండాలు అడ్డు వస్తున్నాయంటూ పదేపదే విజ్ఞప్తి చేశారు. జెండా మనసులో ఉంటే చాలన్నారు.
కొందరు అభిమానులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అంతరాయం కలిగించడంతో ఓ సమయంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానుల తీరుతో ఓ సమయంలో సహనం కోల్పోయి.. కూర్చో అని గట్టిగా అరిచారు. ఎక్కువ చేయకు.. ఆగు, అతి చేయకు, ఆగూ... ఆపెయ్, అతి చేయకు, చాలు.. చాలు, వెనక్కి వెళ్లండి లేదా కూర్చోండి అని అరిచారు. మరో సమయంలోను ఏయ్.. అరవకు, ఆగు అని హెచ్చరించారు.