పవన్ కళ్యాణ్తో వైసీపీ తెరవెనుక ప్రయత్నాలు నిజమేనా: పార్థసారథి ఏం చెప్పారంటే?
హైదరాబాద్/అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం టీడీపీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందా? అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 2014లో పవన్ కళ్యాణ్ మద్దతు వల్ల కూడా టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు కూడా చెప్పారు.
2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సిద్ధమైన పవన్ అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీలపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బాహాటంగానే జనసేనానికి స్వాగతం పలికారు. కానీ వైసీపీ లోలోపల ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసినట్లుగా చాలామంది భావిస్తున్నారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి టీడీపీ బాహాటంగానే పవన్ కళ్యాణ్ను ఆహ్వానించింది. రెండోది.. పవన్ వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే స్పందిస్తోంది. కాబట్టి వైసీపీని తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందా అనే చర్చ సాగుతోంది. మూడోది.. వైసీపీ, టీఆర్ఎస్ల మధ్యనే రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి.
ఆ తెరాస నేతలు ఎవరో చెప్పాలి
జనసేనతో పొత్తు కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామన్న ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. ఈ పొత్తుకు తెరాస మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని వినిపిస్తున్న వ్యాఖ్యలను వైసీపీ సీనియర్ నేత పార్థసారథి తప్పుబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సంప్రదించిన ఆ తెరాస నేతలు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా తాము జనసేనతో కలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారని పార్థసారిథి గుర్తు చేశారు. పవన్ మనసులో వైసీపీతో కలవాలనో, వైసీపీ అండ లేకుంటే సీట్లు రావనో, లేదంటే టీడీపీతో ఉన్న సంబంధాలు బయటపెట్టకుండా ఉండేందుకో అలా మాట్లాడి ఉంటారని చెప్పారు.
వైసీపీని, జనసేనను కలిపేందుకు ఏ శక్తులు పని చేస్తున్నాయి
ఇప్పటి వరకు తాను కేసీఆర్ను కలవలేదని జగన్ చెప్పారని, కాబట్టి వైసీపీని, జనసేనను కలిపేందుకు ఏ శక్తులు పని చేస్తున్ననాయో చెప్పాలని పార్థసారథి అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రలో భాగమన్నారు. నాలుగున్నరేళ్ల పాటు ఏ సిద్ధాంతాల ఆధారంగా టీడీపీతో కలిశారో తెలియదు కానీ, రాబోయే ఎన్నికల్లో టీడీపీతో మీరు (జనసేన) కలుస్తారని చాలామంది చెబుతున్నారని, దాని గురించి బయట పెట్టాలని చెప్పారు. తెరాస నేతలతో చర్చించి, జనసేనతో వెళ్లాలనే యోచన తమకు లేదన్నారు. అలాంటి అవసరం కూడా తమకు లేదన్నారు.