'పవర్' చూపిస్తాడా?: ఊహించని బాంబుపేల్చిన పవన్ కళ్యాణ్, ఆ దెబ్బ కేసీఆర్కేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘాటైన చురకలు అంటించిన మరుసటి రోజే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో షాకి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకు తెలంగాణ ఎన్నికలపై సడి సప్పుడు లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా వచ్చాయని, తాము ప్రిపేర్ కాలేదని, కాబట్టి లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో జనసేనాని చెప్పారు. కానీ నిన్నటి వరకు పరిస్థితి చూస్తే తెలంగాణను వదిలేసినట్లుగా కనిపించింది. కానీ శుక్రవారం హఠాత్తుగా ఆయన లక్నోలో తేలారు.
పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం, హఠాత్తుగా లక్నోలో మాయావతితో భేటీ: ఏపీ-తెలంగాణలలో బీఎస్పీతో పొత్తు
పవన్ -మాయాలు దెబ్బతీసేదెవరిని, అసలు బలం ఉందా?
బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిశారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ, లోకసభ, తెలంగాణ లోకసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఊహించని పరిణామమే. తెలంగాణపై నిన్నటి వరకు మౌనంగా ఉండి, ఇప్పుడు బాంబు పేల్చారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే ఎక్కువగా నష్టపోయేది ఎవరనే చర్చ సాగుతోంది. అదే సమయంలో అసలు ఈ కొత్త కూటమికి తెలంగాణలో బలం ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. దీనికి సంబంధించి లెక్కలు వేసుకుంటున్నారు.
కేసీఆర్తో పవన్ కళ్యాణ్ దోస్తీ కానీ, రాజకీయం చేస్తే విభేదిస్తానని..
2018 చివరలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పరోక్షంగా తెరాసకు మద్దతు పలికారు. వైసీపీతో పాటు, జనసైనికులు పరోక్ష మద్తతు పలికాయని, తెరాస గెలుపుకు సహకరించాయనే వాదనలు ఉన్నాయి. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం రాజ్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో, అంతకుముందు కూడా పవన్, కేసీఆర్లు చాలా స్నేహంగా కనిపించారు. కానీ నిన్నటి వరకు తెలంగాణ విషయంలో మౌనంగా ఉన్న జనసేనాని, హఠాత్తుగా బాంబు పేల్చారు. ఇది తెరాసను దెబ్బతీసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కేసీఆర్తో తనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని, కానీ ప్రజలతో రాజకీయాలు చేస్తే మాత్రం తాను విభేదిస్తానని జనసేనాని చెబుతున్నారు.
జనసేనకు బీఎస్పీ బలం
బీఎస్పీకి తెలంగాణలో చెప్పుకోదగిన బలం లేకపోవచ్చునని, కానీ ఆ పార్టీకి కేడర్ మాత్రం ఉందని గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు బీఎస్పీ టిక్కెట్ పైన గెలిచారు. వారు గెలుపుకు బీఎస్పీయే కారణం కాదు. వారి వ్యక్తిగత బలమే ముఖ్య కారణం. పలు ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తూ పలు నియోజకవర్గాల్లో వేలల్లో ఓట్లు సంపాదించుకుంటోంది. ఎక్కువ సందర్భాలలో ఈ ఓట్లు నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు తెరాసకు పడుతున్నాయనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఓట్లు జనసేన - బీఎస్పీ కూటమికి దక్కుతాయని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోను జనసైనికులు తెరాస వైపు నిలబడ్డారు. జనసేన - బీఎస్పీ కూటమి గెలవకపోవచ్చు కానీ టీఆర్ఎస్ ఓట్లు చీల్చుకుంటే ఆ పార్టీకి దెబ్బపడి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్లకు లబ్ధి జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
జనసేనకు బీఎస్పీ అదనపు బలం
ఇప్పుడు జనసేనాని అండగా ఉండటంతో బీఎస్పీకి అదనపు బలం అంటున్నారు. అలాగే, ఏపీతో పాటు తెలంగాణలోను పవన్ కళ్యాణ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జనసైనికుల బలానికి, వేలల్లో ఓట్లు ఉన్న బీఎస్పీ తోడైతే అధికార, ప్రతిపక్ష పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే, టిక్కెట్ రాకుండా, ఏదో ఒక పార్టీ మీద పోటీ చేయాలని భావించే వారికి ఈ కూటమి మంచి వేదిక అవుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలలో టిక్కెట్ దక్కక.. పోటీ చేయాలని భావించే కీలక నేతలకు జనసేన - బీఎస్పీ మంచి వేదిక అవుతుందని అంటున్నారు. ఈ కలయికతో అనూహ్యం జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.