సైరా ఈవెంట్లో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యపై పవన్ కళ్యాణ్: బౌన్సర్లపై అరిచిన జనసేనాని
హైదరాబాద్: కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కాసేపు మాట్లాడారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను గుర్తు చేసుకొని ఆవేదన చెందారు. అలాగే ఏ నటుడి అనుభవాన్ని తాను తక్కువగా చూడనని చెప్పారు.
అన్నయ్యతో కలిసి వచ్చిన జనసేన అధినేత, వర్షంలో తడుస్తూ...
అన్నయ్యకు నేనూ ఓ అభిమానిని
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఈ సైరా సినిమా ఫంక్షన్కు అతిథిగా పిలిచినందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మీలో (అభిమానుల్లో) ఒకరిగా వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి విషయానికి వస్తే తాను కూడా ఓ అభిమానిని అన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి తన అన్నయ్య అన్నారు. తనను అభిమానులు ఇంతగా ప్రేమిస్తున్నారంటే అందుకు కారణం చిరంజీవి అన్నారు.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యపై...
ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు తాను చాలా బాధపడ్డానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకూ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తన అన్నయ్య భరోసా ఇచ్చారని, ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. తన అన్నయ్య తనకు ఇచ్చిన ధైర్యం, గుండె బలాన్ని ఏ రోజు వదిలి పెట్టలేదన్నారు. అన్నయ్యలా చెప్పే వ్యక్తులు ఆ కుటుంబంలో ఉండి ఉంటే ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేవారు కాదేమో అనుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి బాగు కోరే వారు తన అన్నయ్య అన్నారు.
అన్నయ్య దేశం గర్వించే సినిమాలు చేయాలని
మద్రాస్ లో ఉన్నప్పుడు అన్నయ్య దేశం గర్వించే సినిమాలు చేయాలని కోరుకునే వాడినని పవన్ కళ్యాణ్ చెప్పారు. నబ కంటే చిన్న వాడైన రామ్ చరణ్ స్వార్థం చూసుకోకుండా ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేసినందుకు నా అభినందనలు అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాలు మనకు ఎంతో మోరల్ వ్యాల్యూస్ నేర్పుతాయన్నారు.
భారతదేశం తాలూకు గొప్పతనాన్ని తెలియజేసే సినిమా
భారతదేశం తాలుకు గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది అన్నారు. అన్ని దేశాలు భారత్ పైన దాడి చేశాయని, కానీ భారత్ మాత్రం ఎప్పుడు కూడా ఇతర దేశాలపై దాడి చేయలేదన్నారు. భారతదేశం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంటి వారి మహానుభావుల సమూహం అన్నారు. గాంధీ జయంతి రోజున ఈ సినిమా విడుదల కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లబాయ్ పటేల్, అంబేడ్కర్ వారి వారి జీవిత చరిత్రలు మనకు వారి త్యాగ గుణాన్ని చెబుతుందన్నారు.
ఇది దేశం కోసం తీసిన సినిమా
ఒక వ్యక్తి అనుభవాన్ని ఎప్పుడూ తీసివేయనని పవన్ కళ్యాణ్ చెప్పారు. చిరంజీవి అంటే తనకు ప్రేరణ అన్నారు. ఇలాంటి వారి అనుభవాన్ని తాను తీసిపడేయనని చెప్పారు. ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ సినిమాను ఉదహరించారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి మన దేశం కోసం తీసిన సినిమా అని చెప్పారు.
కాళ్ళపై పడ్డ అభిమాని, బౌన్సర్లపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం..
ఇదిలా ఉండగా, ఓ అభిమాని పవన్ కళ్యాణ్ కాళ్లపై పడ్డాడు. సదరు అభిమానిని బౌన్సర్లు అక్కడి నుంచి లాగివేసే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బౌన్సర్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతనిని అభిమానిని దగ్గరకు పిలిపించుకొని హగ్ ఇచ్చి పంపించారు.