చంద్రబాబు సంగతేంటి?: పవన్ కళ్యాణ్, కేటీఆర్కు ధీటైన కౌంటర్
హైదరాబాద్: తనను పార్ట్ టైం పొలిటిషియన్గా కొందరు నాయకులు చెప్పడం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తనను ప్రతి ఒక్కరూ ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదని చెబుతున్నారని, మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యాపారాలు లేవా? సుజనా చౌదరి వ్యాపారాలు చేయడం లేదా? అని ప్రశ్నించారు. వ్యాపారాలు, వ్యాపకాలు మానేసే వీళ్లంతా రాజకీయాలు చేస్తున్నారా అని పాయింట్ లాగారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తనను ఆంధ్రావాడిగా పేర్కొనడంపై మాట్లాడుతూ.. దాని వల్ల వచ్చే నష్టం ఏమీలేదన్నారు. ఇలాంటి భావజాలం వల్ల దేశ సమగ్రతకు మాత్రం భంగం వాటిల్లుతుందన్నారు.
ఏ వ్యక్తిపైన అయినా అతను ఫలానా ప్రాంతానికి మాత్రమే చెందినవాడు, మా ప్రాంతానికి చెందినవాడు కాదంటూ ముద్ర వేయడం వల్ల ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారని, కేవలం అధికారం కోసం ఇలాంటి రాజకీయాలు చేయడం మానేసే రోజు రావానల్నారు. కేవలం ప్రజా సమస్యలు పరిష్కరించే రోజులు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ప్రత్యేక ప్యాకేజీపై..
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం ఆ డబ్బులు ఇచ్చేసినట్టు, ఆ ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు పూర్తి చేసినట్లు సంబరాలు చేసుకుంటామని చెప్పడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఏపీ ప్రజలను నిలువునా ముంచిన కాంగ్రెస్, బిజెపి అధిష్ఠానాలు రెండూ రాష్ట్రానికి వచ్చి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
చావడానికి సిద్ధం: చంద్రబాబు-వెంకయ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్
అలా కాకుండా రాష్ట్రానికి అది చేస్తాం, ఇది చేస్తాం అని చెబితే ఎవరు నమ్ముతారన్నారు. కనీసం వారి పార్టీ కార్యకర్తలైనా వారిని నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఏపీలో ప్రజల్లోకి వచ్చి చూడాలన్నారు. నలుగురు నేతలు, పార్టీ అనుచరులు ఏది చెబితే అదే వాస్తవం కాదన్నారు.
ప్రజల్లోకి ఎవరైనా వెళ్లగలిగితే వారికి వాస్తవాలు తెలుస్తాయన్నారు. మనస్సాక్షి మీద చెయ్యివేసి వారు నిజాలు మాట్లాడితే అప్పుడు వాస్తవాలు తెలుస్తాయన్నారు. బిజెపి సంబరాలు చేసుకుంటానంటే ఏమనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. తనకు వామపక్షాల పైన గౌరవం ఉందన్నారు.