విడిపోతే పడిపోతాం: ప్రత్యేక హోదాపై ఎంపీ కవితకు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెరాస నేత కల్వకుంట్ల కవితకు ధన్యావాదాలు తెలిపారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెరాస నేత కల్వకుంట్ల కవితకు ధన్యావాదాలు తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆమె చెప్పినందుకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు.
'ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పినందుకు నిజామాబాద్ ఎంపీ కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మన (తెలుగు రాష్ట్రాల) సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని, కలిసి పని చేయాలని' పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
చివర్లో.. కలిసి ఉంటే కలదు సుఖం.. విడిపోతే పడిపోతాం... అని రాసి, జై హింద్ అని పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కవిత అన్నారు. తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు.
వంటింట్లో కూడా, అమెరికాలో అలా: 'జై ఆంధ్రప్రదేశ్' అని నినదించిన కవిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మీడియా ప్రతినిధులు ఎంపీ కవిత అభిప్రాయాన్ని కోరారు. దీనిపై ఆమె స్పందించిన కవిత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని ఆమె గుర్తు చేశారు. ఏపీకి తాము అండగా ఉంటామన్నారు.