జనసేన సిద్ధాంతాలు ఇవే, ఇవి దేశపటిష్టతకు మూలాలు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన పార్టీ సిద్ధాంతాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇటీవల విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ మహిళను వివస్త్రను చేసిన సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన వరుస ట్వీట్లు చేశారు.
ఆ తర్వాత జనసేన సిద్ధాంతాలపై మరో ట్వీట్ చేశారు. 'కులాలని కలిపే ఆలోచనా విధానం. మతాల ప్రస్తావనలేని రాజకీయం. భాషల్ని గౌరవించే సంప్రదాయం. సంస్కృతుల్ని కాపాడే సమాజం. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం. ఇవి దేశప్రతిష్టకు మూలాలు.. ఇవే జనసేన సిద్ధాంతాలు' అని పేర్కొన్నారు.
జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పలు అంశాలపై స్పందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన పెందుర్తి ఘటనపై తీవ్రంగా స్పందించారు.
మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘటనపై ఆయన ఘాటుగా స్పందించారు. అధికార, విపక్షాలు ఈ అంశంపై విమర్శలు చేసుకోవడం మానేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అసెంబ్లీలో చర్చించాలని హితవు పలికారు. మహిళపై దాడి అన్యాయమన్నారు.