యువతకు పిలుపు: ప్రపంచంలోనే పెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్
Recommended Video
హైదరాబాద్: ప్రపంచ అతిపెద్ద జాతీయ జెండా(22,326 స్క్వేర్ ఫీట్లు)ను ఎన్టీఆర్ స్టేడియంలో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఆవిష్కరించారు. ఓ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొని జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా సదరు సంస్థకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ సమైక్యతకు నిదర్శనం
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జులై 22, 1947లో మన జాతీయ జెండాకు జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోని సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. జెండాలోని రంగులు కానీ, ధర్మ చక్రం కానీ.. జాతీయ సమైక్యతకు నిదర్శనమని అన్నారు.
కాషాయం అంటే..
జాతీయ జెండా అంటే అది ఏదో ఒక పార్టీది కాదని, మతానిది కాదని, ప్రాంతానిది కాదని.. ప్రతీ ఒక్కరిదని సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారని పవన్ చెప్పారు. జాతీయ జెండాలోని కాషాయం రంగు అంటే హిందువులది కాదని, రాజకీయ నాయకులు స్వలాభం కోసం కాకుండా ప్రజలకు నిస్వార్థ సేవ అందించాలనే విషయాన్ని తెలుపుతుందని అన్నారు.
ప్రతిజ్ఞ చేసిన పవన్
జాతీయ జెండాను చూసినప్పుడల్లా ఉవ్వెత్తున ఎగిసిపడే గుండె ధైర్యం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఆత్మస్థైర్యం రెపరెపలాడుతోందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. దేశ భక్తి రాజకీయ నాయకులు మర్చిపోయారు కానీ, విద్యార్థులు, యువత కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.
ఒక్కసారిగా పవన్ వద్దకు అభిమానులు
భారత్ మాతాకీ జై, జైహింద్ అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అక్కడుని బయల్దేరి వెళుతుండగా ఒక్కసారిగా అభిమానులంతా పవన్ను చుట్టుముట్టేశారు. ఆయన్ను దగ్గరగా చూడాలని ప్రయత్నించారు. దీంతో అక్కడ కొంత తోపులాట జరిగేలా కనిపించింది. అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో పవన్ను అక్కడ్నుంచి ఆయన వాహనం వద్దకు వేగంగా తీసుకెళ్లారు పోలీసులు. ఆ తర్వాత పవన్ తన వాహనంలో వెళ్లిపోయారు.