జైలుకు వెళతారా? ఏ నేరం చేయనక్కర్లేదు, రూ.500 చెల్లిస్తే చాలు.. ఒక్క రోజు జైలుకు..!
జైలు జీవితం ఎలా ఉంటుంది? జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు? అక్కడ వారిని ఎలా ట్రీట్ చేస్తారు? ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? ఊ.. అంటే రండి. జైలు జీవితం ఎలా ఉంటుందో మీరూ తెలుసుకోవచ్చు.
సంగారెడ్డి: జైలు జీవితం ఎలా ఉంటుంది? జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు? అక్కడ వారిని ఎలా ట్రీట్ చేస్తారు? ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? ఊ.. అంటే రండి. జైలు జీవితం ఎలా ఉంటుందో మీరూ తెలుసుకోవచ్చు.
దీనికోసం మీరేమీ నేరం చేయాల్సిన అవసరం లేదు. మీ జేబులో కేవలం రూ. 500 ఉంటే చాలు. జైల్లోకి వెళ్లడమే కాదు.. అక్కడ ఖైదీగా ఒక రోజంతా గడిపేయవచ్చు. అది ఎలాగో చూడాలంటే సంగారెడ్డి జైలుకు వెళ్లాల్సిందే.
తెలంగాణలో జైళ్లశాఖ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. సంగారెడ్డి జిల్లా జైల్లో 'ఫీల్ ద జైల్' కార్యక్రమం చేపట్టింది. 1796లో అప్పటి నిజాం నవాబు కట్టించిన భవనాన్ని కొన్నేళ్ల తర్వాత పాత మెదక్ జిల్లా జైలుగా మార్చారు.
కొన్ని శతాబ్దాలపాటు ఈ భవనం జిల్లా జైలుగా సేవలు అందించింది. అయితే 2012లో సంగారెడ్డికి పక్కన కంది మండలంలో కొత్త జిల్లా జైలును నిర్మించారు. దీంతో ఇక్కడి ఖైదీలను కంది జైలుకు తరలించారు.
తర్వాత ఈ భవనానికి హెరిటేజ్ హోదా కల్పించారు. అయితే ఈ భవనం ఖాళీగా ఉండడంతో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ వినూత్నంగా ఆలోచించారు. జైలు జీవితం ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకునేవారి కోసమే 'ఫీల్ ద జైల్' కార్యక్రమాన్ని రూపొందించారు.
2016 జులై నెలలో ప్రారంభించిన 'ఫీల్ ద జైల్' కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 21 మంది సంగారెడ్డి జైల్లో గడిపారు. ఒక్క రోజు జైల్లో గడపాలనుకునే వారు.. ముందుగా తాము అన్నివిధాలా ఆరోగ్యంగా ఉన్నామని, తమ ఇష్టపూర్వకంగానే 24 గంటలపాటు జైల్లో ఉండడానికి వచ్చామని లిఖిత పూర్వంగా రాసి ఇవ్వాలి.
తర్వాత జైలు అధికారులు వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మాత్రమే అనుమతి ఇస్తారు. జైల్లో గడపాలనుకునే వారు ముందు రూ. 500 చెల్లించి రసీదు తీసుకోవాలి.
సెల్ ఫోన్, వాలెట్, వాచీ, బెల్ట్ లాంటి వస్తువులను లాకర్లో పెట్టాలి. లోపలికి న్యూస్ పేపర్ మినహా ఎలాంటి వస్తువులను అనుమతించరు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న పుస్తకాలను అసలు అనుమతించరు.