రాత పరీక్ష స్కాం: 16మంది కానిస్టేబుళ్ల అరెస్ట్, మొత్తం 97మంది
హైదరాబాద్: పోలీసు శాఖలో జరిగిన భారీ రాత పరీక్ష స్కాం వెలుగు చూసింది. 2010లో కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఇప్పటికే విధుల్లో ఉన్న 16మంది పోలీసులను అరెస్ట్ చేసింది.
నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఈ స్కాం వెలుగుచూసింది. రాత పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన సీఐడీ.. 2011లో కానిస్టేబుళ్లుగా ఎంపికై, పోస్టింగ్ తీసుకున్న 10మంది కానిస్టేబుళ్లను మొదట అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మరో ఆరుగురు కానిస్టేబుల్లను అదుపులోకి తీసుకుంది.
ఒకరికి బదులు మరొకరితో రాత పరీక్షలు రాయించినట్లు గుర్తించిన ఎస్ఎఫ్ఎల్ నివేదిక ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేపట్టి స్కాం గుట్టును రట్టు చేసింది. సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో అక్రమాలకు పాల్పడిన 10మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 97మంది ఇలా అక్రమాలకు పాల్పడి ఉద్యోగాన్ని పొందినవారేనని సీఐడీ గుర్తించింది. ప్రస్తుతానికి 16మందిని అరెస్ట్ చేసిన సీఐడీ.. మిగితా వారిని అరెస్ట్ చేసే పనిలో పడింది. సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు సమాచారం.