కష్ట కాలంలో కూడా కార్మికులను పట్టించుకోరా..? తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డి పిసీసీ ఛీఫ్ ఉత్తమ్..!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే వేడుకల సందర్భంగా ఐఎన్టియుసి జెండాను ఎగురవేసిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తోందని విరుచుకుపడ్డారు. అంతే కాకుండా బిఓసిడబ్ల్యు సెస్ ద్వారా సేకరించిన 1,000 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించిందని తెలంగాణ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. అంతే కాకుండా కరోనా వైరస్ వంటి క్లిష్ట సమయంలో కూడా రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, తెలంగాణలోని టిఆర్ఎస్ ప్రభుత్వం రెండూ మొదటి నుంచి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
లాక్ డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ఎటువంటి ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ విధించారని అన్నారు. లక్షలాది మంది వలస కార్మికులు ఆహారం, ఆశ్రయం లేకుండా రోడ్లపైన మిగిలిపోయారని వారిలో చాలా మంది వందల కిలోమీటర్లు నడుస్తూ ఇళ్లకు చేరుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మందులు మరియు ఇతర అవసరాలు అవసరమయ్యే పెన్షనర్లు కూడా వారి పెన్షన్ మొత్తంలో 50% కోతను ఎదుర్కోవలసి వచ్చిందని, సంక్షోభాన్ని సరైన రీతిలో ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ, సిఎం చంద్రశేఖర్ రావులు ఘోరంగా విఫలం అయ్యారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కార్మికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, ఇది చాలా కాలం పాటు ప్రభావం చూపుతుందని టిపిసిసి చీఫ్ చెప్పారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అది వారికి ఏ రూపంలోనైనా సహాయం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.