తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న ఆ నియోజకవర్గం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేకి అని ఆరోపించారు పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ పార్టీ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దుపై ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కోర్టులకు వెళ్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో తాము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా హరీష్రావు రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ఆరోపణలకు ప్రత్యారోపణలు బాగానే చేస్తున్నప్పటికి ప్రధానమైన ఓ అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్చిపోయి వివాదానికి కేంద్రబిందువయ్యారు. అదిష్టానం తప్ప ఎవ్వరు కూడా అభ్యర్థులను ప్రకటించే సాప్రదాయం ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో లో లేదన్న చిన్న విషయాన్ని మర్చిపోయి నేతల మద్య చిచ్చు రగిల్చారు. సూర్యపేటలో పలానా అభ్యర్థిని మంచి మెజారితో గెలిపించాలని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పిలుపునిచ్చి నాలిక కరుచుకున్నారు ఉత్తమ్. ఉత్తమ్ వాఖ్యలతో మండిపడుతన్న ఆ నాయకుడు అదిష్టానానికి ఫిర్యదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో ఎన్నికల హీట్.. అభ్యర్థుల వేటలో పార్టీలు..
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎలాగైనా 2019 ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తుంటే..ఆ పార్టీని ఎలాగైనా నిలవరించి అధికార పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇరు పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలు రచించే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్లో ముందస్తుగా టిక్కెట్లు ప్రకటించే సాంప్రదాయం లేదనే అందరికీ తెలిసిందే. ఎన్నికలు సమయం దగ్గరకి వచ్చినప్పుడు హైకమాండ్ ఎవరికి టిక్కెట్ ఇస్తే వారి గెలుపు కోసం కృషి చేస్తారు. కానీ ఆ పార్టీ సాంప్రదాయానికి విరుద్ధంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి.
కాంగ్రెస్ సంప్రదాయాలకు విరుద్దంగా అభ్యర్థిని ప్రకటించిన ఉత్తమ్..!!
ఇటీవల సూర్యాపేట పర్యటనకి వెళ్ళిన టీపిసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాంరెడ్డి దామోదర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో దామోదర్ రెడ్డి కీలకంగా పనిచేశారని ప్రశంసించారు. అలా ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సూర్యాపేట కాంగ్రెస్లో సీటు పంచాయతీ మరింత ముదిరేలా చేశాయి. సూర్యపేట టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పాత నేతలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఇదీ ముమ్మాటికి ఉత్తమ్ తప్పే అంటున్న ఆశావహులు..
అయితే ఉత్తమ్ వ్యాఖ్యలతో దామోదర్ రెడ్డి వర్గం హర్షం వ్యక్తం చేస్తుంటే, సూర్యాపేట టిక్కెట్ ఆశిస్తున్న మరో ముఖ్యనేత పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. సభలో ఉత్తమ్ తరువాత మాట్లాడిన యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ సైతం దామోదర్ రెడ్డిని గెలిపించాలనడంతో రమేష్ రెడ్డి వర్గీయులు నిరసనకు దిగారు. దీంతో కాసేపు ఘర్షణ వాతావరణం కనబడింది. గత ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ తరపున రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టీడీపీ నుంచి పటేల్ రమేష్ రెడ్డి పోటీ చేశారు. అయితే రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన రమేష్ రెడ్డి, ఇటీవల రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇక రేవంత్ కోటాలోనే ఆయనకు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా దక్కింది.
చిచ్చు రగిల్చిన ఉత్తమ్ ప్రకటన.. హైకమాండ్ వద్దకు పంచాయితి..
వచ్చే ఎన్నికల్లో కూడా సూర్యాపేట టిక్కెట్ దక్కుతుందని ఆశతో ఉన్న పటేల్ రమేష్ రెడ్డి, ఉత్తమ్ ప్రకటనపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ లో ముందస్తుగా టిక్కెట్లు ప్రకటించే సాంప్రదాయం లేదని తెలిసి కూడా సూర్యాపేట అభ్యర్ధిని ముందుగా ప్రకటించడంతో ఆ నియోజకవర్గ పంచాయితీ అధిష్టానానికి తలనొప్పిలా తయారయ్యే అవకాశం ఉంది. రేవంత్ కోటరీలోని రమేష్ రెడ్డికి జరిగుతున్న అన్యాయం పై ఫైర్ బ్రాండ్ ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ సూర్యాపేట కార్యకర్తల్లో నెలకొంది. అంతే కాకుండా ఉత్తమ్ తో మొదలైన సీటు పంచాయితీని ఆయనే ఎలా పరిష్కరిస్తారో చూడాలి.