హస్తినకు ఉత్తమ్.. సోనియాతో భేటీ, ఉప ఎన్నిక ఫలితంపై చర్చ, పర్యటనపై ప్రాధాన్యం
పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఆయన హస్తిన టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటనలో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో ఓటమి గురించి చర్చకొచ్చే అవకాశం ఉంది. ఓటమికి గల కారణాలను సోనియాకు ఉత్తమ్ వివరించే ఛాన్స్ ఉంది.
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించడంపై కాంగ్రెస్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరూ అసంతృప్త స్వరం కూడా వినిపించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన తర్వాత ఉత్తమ్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ విజయం సాధించారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో.. ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఉప ఎన్నికకు తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. అయితే ఆమె కోదాడ నుంచి ఓడిపోవడంతో.. టికెట్ వద్దనే అంశం కూడా చర్చకొచ్చింది. కానీ ఉత్తమ్ మాత్రం పద్మావతికే టికెట్ ఇప్పించారు. ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. దీంతోపాటు పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు కూడా ఉత్తమ్ హాజరవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ హుజూర్ నగర్ ఫలితం తర్వాత ఉత్తమ్ హస్తిన పర్యటన మాత్రం ప్రాధాన్యం కలిగిస్తోంది.