రేవంత్ రెడ్డికి పిసిసి ఖరారు?హుజూర్ నగర్ ఉప ఫలితం తర్వాత ప్రకటన?పాదయాత్రకు ప్లాన్ చేస్తున్న ఎంపీ..!!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు ముద్రపడిన మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి తెలంగాణలో మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామాన్ని సందర్శించి స్ధానిక సపమస్యలను తెలుసు కోవడం, ప్రభుత్వ విధానాల పట్ల చైతన్యం తీసుకురావండం వంటి కార్యక్రమాలకు వ్యూహ రచన చేస్తున్నారు.
ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా తుర్కపల్లి పంచాయతీ స్థాయి సమావేశంలో వెల్లడించారు. తనకు అన్ని పనులు సెట్ అయిపోయినట్టుగా, ఇక తెలంగాణలో గ్రామ గ్రామం చుట్టే పాదయాత్రపని మాత్రమే మిగిలి ఉందని, అది కూడా త్వరలో నిర్వహిస్తానని గ్రామస్తుల సమక్షంలో స్పష్టం చేసారు. అంతే కాకుండా పీసిసి అధ్యక్షపదవి కూడా దాదాపు ఖరారయినట్టు, హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎఐసిసి అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డికి పిసీసీ ఖరారు.. హుజూర్ నగర్ ఉప పోరు తర్వాత ప్రకటన..
రాబోవు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డికి ఉన్న ప్రజాధరణను ఆసరా చేసుకుని ఆయ తన భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అన్ని జిల్లాల్లోని గ్రామాలను సందర్శించి మౌళిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల అమలు, విద్యా వ్యవస్థ, గ్రామ పరిపాలన తదితర అంశాలను స్వయంగా తెలుసుకోనున్నారు రేవంత్ రెడ్డి.
పాదయాత్రకు శ్రీకారం చుడుతున్న రేవంత్ రెడ్డి.. మారనున్న రాజకీయ పరిణామాలు..
తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి పక్కా ప్రణాళిక రచిస్తున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ప్రభుత్వంలో నెలకొన్న లోపాల ఆధారంగా ప్రజలను చైతన్య పరచాలని, ఎన్నికల సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలను ఏమేరకు అమలు చేసారనే అంశాలను ప్రధానంగా జలనాల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.
ఉత్తమ్ పార్టీకి మంచి విధేయుడే.. కాని పార్టీని గెలిపించలేక పోయారన్న భావనలో అధిష్టానం..
అంతే కాకుండా అధిస్టానం కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే నేత కోసం కాంగ్రెస్ ఢిల్లీ ముఖ్య నేతలు ఎదురు చూస్తున్నట్టు, అది రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణ కాంగ్రెస్ కు దొరికిన ఆయుధంగా అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రేవంత్ రెడ్డికి విద్యార్థి లోకం నుండే కాకుండా తెలంగాణ ప్రజానికంలో పెద్ద యెత్తున ఆదరణ ఉన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రేవంత్ ను ప్రోత్సహించాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసిసి అద్యక్షుడిగా అవకాశం ఇచ్చినా ఆశించిన ఫలితం కనిపించలేదనే భావనలో అధిష్టానం ఉంది.
పద్మావతి ఆసక్తికర వ్యాఖ్యలు.. రేవంత్ ప్రచారానికి రావాలంటున్న ఉత్తమ్ భార్య..
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కూడా పద్మావతికి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుజ్జగించి, చివరి కోరికగా అధిష్టానం మన్నించినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డికి మార్గాన్ని అదిష్టానం సుగమం చేసినట్టు తెలుస్తోంది. మరికొంత మంది సీనియర్ల అసంతృప్తులు చల్లారే వరకు కొద్ది రోజులు వేచి చూసే ధోరణిని ఏఐసిసి అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది. పరిస్ధితులు సర్దుమనిగి, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఫలితం అనుకూలంగా వచ్చిన మరుక్షణం రేవంత్ రెడ్డి కి పీసిసి ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఉత్కంఠగా మారిన హుజూర్ నగర్ ఉప పోరు..
ఐతే తెలంగాణలో రేవంత్ రెడ్డికి అన్ని వర్గాలనుంచి మంచి ఫాలోయింగ్ ఉండడంతోపాటు, అదికార గులాబీ పార్టీని సూటిగా ప్రశ్నించగల సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉన్నట్టు చాలా సందర్బాల్లో రుజువయ్యింది. ఇదే అంశాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుని రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించేందుకు సిద్దపడినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండడంతో పీసిసి అధ్యక్ష్య పదవి ఖాయమైనట్టు సమాచారం.
హుజూర్ నగర్ ఉప పోరు ప్రతిష్టాత్మకం.. ప్రీ ఫైనల్ గా భావిస్తున్న రేవంత్ రెడ్డి...
ఇదిలా ఉండగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అభ్యర్ధి అంశలో వివాదాలు చెలరేగినప్పటికి అభ్యర్ది గెలుపు కోసం అందరం సమిష్టిగా కృషి చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొనడం విశేషం. అంతే కాకుండా రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ప్రచారానికి వస్తే తన గెలుపు సులభం అయ్యే అవకాశాలు ఉన్నాయని స్వయంగా పద్మావతి పేర్కొనడం కొసమెరుపు. అందుకే హుజూర్ నగర్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి ప్రి-ఫైనల్ పరీక్షగా పరిణమించింది.