కెసిఆర్ ఎఫెక్ట్: కాంగ్రెస్, టిడిపి పొత్తుకు ఓకే, కానీ, పొత్తుతో నష్టమే
2019 ఎన్నికలలో టిడిపితో కలిసిపనిచేసేందుకు సిద్దమేనని మాజీ కేంద్ర మంత్రి చేసిన ప్రతిపాదనను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్ధించారు.
హైదరాబాద్: 2019 ఎన్నికలలో టిడిపితో కలిసిపనిచేసేందుకు సిద్దమేనని మాజీ కేంద్ర మంత్రి చేసిన ప్రతిపాదనను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్ధించారు. బిజెపి, టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అయితే ఈ ప్రతిపాదన పట్ల టిడిపి కూడ సానుకూలంగా స్పందించింది. బావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని టిడిపి ప్రకటించింది.
తెలంగాణలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉంది.అయితే ఎన్నికలకు ముందుగానే రాజకీయకూటములు, పొత్తుల విషయమై పార్టీల మద్య చర్చలు ప్రారంభమయ్యాయి. టిఆర్ఎస్ ను గద్దెదించేందుకు కలిసివచ్చే పార్టీలతో కలిసిపనిచేసేందుకుగాను కాంగ్రెస్, టిడిపిలు చేతులు కలపనున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహ పార్టీల మధ్య పొత్తులు కొనసాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. టిడిపి ఆవిర్భావం నుండి ఆ పార్టీతో సుదీర్ఘ కాలంపాటు వామపక్షాలకు పొత్తు కొనసాగించింది. 1985 లో కొద్ది కాలం, 1999 లో, 2014 ఎన్నికల్లో టిడిపి బిజెపితో పొత్తును పెట్టుకొంది. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ టిడిపి వామపక్షాలతో కలిసే పోటీచేసింది.
జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించిన ఉత్తమ్
2019 ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీతోనైనా తాము పొత్తుపెట్టుకొనేందుకు సిద్దమేనని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హమీని అమలు చేయలేదని ఉత్తమ్ ఆరోపించారు. పార్టీ అవసరాల రీత్యాఏ పార్టీతో పొత్తు అవసరమో ఆ పార్టీతో పొత్తును ఏర్పాటు చేసుకొంటామని ఉత్తమ్ చెప్పారు.కామారెడ్డిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ ఈ విషయమై స్పష్టతనిచ్చారు.టిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోన్నందునే సర్వే పేరుతో తన గ్రాఫ్ ను పెంచుకొనేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నాడని ఉత్తమ్ విమర్శించారు.
టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్న పొంగులేటి
టిడిపితో పొత్తును ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో పార్టీని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సమయంలో ఇతర పార్టీలతో ఎందుకు పొత్తు అవసరమని ఆయన ప్రశ్నించారు.అంతేకాదు పొత్తులు అనేవి పార్టీ విధాన ప్రకారం ఉంటుందన్నారు. బీజెపితో పొత్తుతో భాగస్వామ్యంగా ఉన్న టిడిపితో పొత్తు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ తో పొత్తుకు టిడిపి సై
టిడిపి అంటరాని పార్టీ కాదు, ఆ పార్టీతో 2019 ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకుగాను తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిచేసిన వ్యాఖ్యలను టిడిపి స్వాగతించింది. 2019 ఎన్నికల్లో బావసారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు టిడిపి తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ప్రస్తావిస్తూ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
2019 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3 వేలను ఇవ్వనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ప్రతి రైతుకు రూ.2 లక్షల పంటరుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ఏడాది ముందే మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మ్యానిఫెస్టోను సిద్దంచేస్తోంది కాంగ్రెస్ పార్టీ.