భార్యాభర్తలే వ్యభిచార నిర్వాహకులు-పీడీ యాక్ట్ నమోదు-చర్లపల్లి జైలుకు తరలింపు
హైదరాబాద్ సరూర్ నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ దంపతులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ దంపతులు కాలేజీ విద్యార్థినులను టార్గెట్ చేసి... బలవంతంగా వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. పలు ప్రాంతాల నుంచి యువతుల అక్రమ రవాణాకు కూడా పాల్పడినట్లు వెల్లడైంది. పక్కా ప్లాన్తో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి వ్యభిచార దందాను బట్టబయలు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... గత నెల 15న సరూర్ నగర్,రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఈ వ్యభిచార దందా గుట్టు రట్టయింది. సరూర్ నగర్లోని ఓ ఇంట్లో చందన నాగ రవిరాజా,చందన సునీత అలియాస్ అనూష అనే భార్యాభర్తలు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఓ విటుడిని,యువతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారితో పాటు రవిరాజా,సునీతలను అరెస్ట్ చేశారు.
వ్యభిచార అభియోగాలపై వీరి మీద పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. సులువుగా డబ్బు సంపాదించేందుకే రవిరాజా దంపతులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. పలు ప్రాంతాల నుంచి యువతులను అక్రమంగా తీసుకొచ్చి బలవంతంగా వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు కాలేజీ విద్యార్థులను సైతం ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి వాళ్ల మాయలో పడవద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. వ్యభిచారం,యువతుల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందన్నారు.
గత నెలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోటలోనూ వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బొమ్మరవేని సాయికుమార్,అతని భార్య కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వాట్సాప్ ద్వారా యువతుల ఫోటోలు పంపిస్తూ గంటకో రేటు చొప్పున దందా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇదే క్రమంలో ఓరోజు రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి విటులు,యువతులతో పాటు నిర్వాహకులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు.