అతనో వ్యభిచారి.., క్యాబ్లో ఎక్కిన మహిళల్ని!: పదేళ్ల బాలికనూ వదల్లేదు..
హైదరాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ క్యాబ్ డ్రైవర్.. ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించాడు. ఆఖరికి పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై సైతం రోజుల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. మానసిక రోగిలా ప్రవర్తిస్తున్న అతను ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో అతగాడు చేసిన నేరాల చిట్టాను పోలీసులు గురువారం మీడియాకు వివరించారు.
ఎవరతను?:
లాలాపేట శాంతినగర్కు చెందిన కందుకూరి నాగమధుకిరణ్ నగరంలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పదో తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. వారాసిగూడకు చెందిన మహేష్ వద్ద తెలిసినవాళ్ల సహాయంతో ఓలా క్యాబ్ డ్రైవర్గా చేరాడు. అప్పటినుంచి తన క్యాబ్ లో ఎక్కే మహిళలను లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్నాడు.
మధుకిరణ్పై పీడీ యాక్ట్:
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం, క్యాబ్లో ఎక్కిన మహిళా ప్రయాణికురాలిపై అత్యాచార యత్నంతో పాటు పలువురు మహిళలను వేధించిన కేసులో ప్రస్తుతం అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసుల్లో అతనిపై పీడీ యాక్టు ప్రయోగించినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ గురువారం ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో వెల్లడించారు.
వ్యభిచారం.. వివాహేతర సంబంధాలు:
నాగమధు కిరణ్ వ్యభిచారానికి కూడా అలవాటు పడ్డట్టు పోలీసులు తమ విచారణలో తేల్చారు. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కూడా కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అయితే నాగమధుపై పట్ల ఉన్న భయంతోనే బాధితులెవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పారు. ఇతని వల్ల చాలామంది మహిళా ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వివరించారు.
సీసీటీవి ఫుటేజీతో దొరికిపోయాడు..:
క్యాబ్ లో తనను వేధించాడంటూ గత నెల 5న ఒక మహిళా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. ఇతగాని లీలలన్ని వెలుగులోకి వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవి ఫుటేజీ సహాయంతో అతన్ని గుర్తించి గత నెల 14న అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్లోని రాధికా క్రాస్రోడ్స్ నుంచి సైనిక్పురి వెళ్లేందుకు తాను క్యాబ్ చేసుకున్నానని, మార్గమధ్యలో కారు ఆపిన డ్రైవర్.. డోర్ లాక్ చేసి తనపై వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాలికపై రేప్..:
మహిళలనే కాదు చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు క్యాబ్ డ్రైవర్. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పదేళ్ల బాలికను 3 నెలల క్రితం నాగమధు కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు వివరించారు. నగరంలో మహిళలు క్యాబ్ డ్రైవర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.