అభయారణ్యంలో వన్యప్రాణుల వేట: నెమళ్లను చంపి, మాంసం విక్రయం
వరంగల్: జిల్లాలోని అభయారణ్యంలో వన్యప్రాణుల వేట జోరుగా కొనసాగుతోంది. అడ్డూఅదుపులేకుండా వేటాడి మాంసాన్ని అమ్ముకుంటున్నారు వేటగాళ్లు. అటవీశాఖ అధికారులతో కుమ్మక్కైన వేటగాళ్లు యధేచ్ఛగా తమ పనిని కానిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాగా, అటవీ ప్రాంతంలో నెమళ్ల వేటకు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పోలీసులు వేటగాళ్ల ఆగడాలపై దృష్టి సారించారు.
వేటగాళ్లు అధిక సంఖ్యలో నెమళ్లను చంపి వాటి మాంసాన్ని స్థానిక, ఇతర ప్రాంతాల దాబాలకు అమ్ముతున్నట్లు సమాచారం. పరకాల, రేగొండ ప్రాంతాల్లో ఇప్పటికే 20నెమళ్లు వేటగాళ్ల బారిన పడ్డాయి.
ఈ ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వేటగాళ్లు గత కొంతకాలంగా వన్యప్రాణుల వేటను కొనసాగిస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. గ్రామాల సమీపంలోని పంట పొలాల్లోకి వచ్చిన సమయంలోనూ వేటగాళ్లు వాటిని వేటాడి చంపేస్తున్నారని చెబుతున్నారు.
మైనర్ బాలికపై ఆత్యాచారం
మైనర్ బాలిక అత్యాచారానికి గురైన సంఘటన వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం లాడాయిగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాడాయిగడ్డ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సంపత్(32) అనే వ్యక్తి గురువారం సాయంత్రం ఆత్యాచారానికి పాల్పడ్డాడు.
అది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం కొత్తగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.