బకాయిల భారం-నిర్వహణ కష్టం: సెస్లో పేరుకుపోయిన బకాయిలు రూ.135కోట్లు
ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంస్థకు బకాయిలు గుదిబండగా మారాయి.
కరీంనగర్: ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంస్థకు బకాయిలు గుదిబండగా మారాయి. విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్న సెస్లో బకాయిల భారంతో నిర్వహణ కష్టసాధ్యమవుతోంది.
పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల ద్వారా చెల్లించాల్సిన బకాయిలు అధికంగా ఉండటంతో 'కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం' అన్న చందంగా తయారైంది ఇక్కడి పరిస్థితి. గ్రామ పంచాయతీలు, చిన్న తరహా పరిశ్రమల్లో విద్యుత్తు బిల్లుల భారం పెరిగిపోతున్న తరుణంలో వసూళ్ల కోసం విద్యుత్తు అధికారులు సరఫరా నిలిపివేయడం... ప్రజా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పునరుద్ధరించడం వంటి చర్యలు ఇటీవలి కాలంలో పరిపాటిగా మారాయి.
బకాయిల భారం శ్రుతిమించే స్థాయికి చేరుకోవడంతో తమ మనుగడను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు సెస్ సిద్ధమవుతోంది.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెస్ విద్యుత్తు సంస్థ పరిధిలో ఏడు విభాగాలుగా విద్యుత్తు వినియోగదారులున్నారు. మొదటి కేటగిరిలో గృహఅవసరాలు. రెండులో వాణిజ్యం, మూడు భారీ పరిశ్రమలు, నాలుగు చిన్న పరిశ్రమలు, ఐదు వ్యవసాయం, ఆరు పంచాయతీలు, ప్రభుత్వశాఖలు, ఏడు ఆలయాలకు కేటగిరిలవారీగా విద్యుత్తు సరఫరాను విభజించారు.
జిల్లాలోని 211 పంచాయతీలకు రెండు విడతలుగా 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.15.97కోట్లు విడుదలయ్యాయి. వీటిలో 30శాతం నిధులను దశలవారీగా విద్యుత్తు బకాయిలు చెల్లించుకునేందుకు వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఏప్రిల్ నెలలోపు రెండు విడతలుగా నిధులు విడుదలైనా బకాయిలు చెల్లించడంలో పంచాయతీలు ముందుకురావడంలేదు. పంచాయతీల్లో తాగునీరు, విద్యుత్తు సరఫరాకు వినియోగించుకున్న బకాయి ఇప్పటికి రూ.93.06 కోట్ల బకాయిలున్నాయి. సెస్కు ఉన్న విద్యుత్ బకాయిల్లో అధికమొత్తంలో గ్రామపంచాయతీలే కావడం గమనార్హం.
రెండు విడతల్లో రాయితీ విడుదల
టెక్స్టైల్ పార్కులోని 116 పరిశ్రమలకు ప్రస్తుతం 111 పరిశ్రమలు నడుస్తున్నాయి. పార్కు ప్రారంభంలో పరిశ్రమలకు ప్రభుత్వం మొదటి మూడేళ్లు 2007-09లో పూర్తిస్థాయిలో రాయితీ ఇచ్చింది. 2010-14 సంవత్సరాల కాలానికి పరిశ్రమల యజమానులు అప్పటి ప్రభుత్వాన్ని రాయితీ ఇవ్వాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో మంత్రి కేటీఆర్ చొరవతో రెండు విడతలుగా 50శాతం విద్యుత్తు రాయితీకింద రూ.8.68కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో విద్యుత్తు బిల్లులు చెల్లించిన పరిశ్రమల యజమానులకు 50శాతం రాయితీ పొందారు. పరిశ్రమల్లో పేరుకుపోతున్న బకాయిల దృష్ట్యా సెస్ దశలవారీగా చెల్లించేందుకు ముందుకు వచ్చింది. పరిశ్రమలో ఆర్థిక ఇబ్బందులతో కొందరు యజమానులు ఆలస్యంగా చెల్లించినా బకాయిల సర్దుబాటుతో విద్యుత్తును తొలగించలేదు. ఇటీవల పార్కులోని 10 పరిశ్రమలకు సెస్ అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. వీటిలో ఆరు పరిశ్రమలు బకాయిలో కొంత మొత్తంలో చెల్లించి తిరిగి విద్యుత్తును పునరుద్ధరించుకున్నారు.
వ్యవసాయానికి నిరంతర సరఫరాతో ఇబ్బందులు
జిల్లాలోని సెస్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సేవలు అందించేందుకు నియంత్రికలు, ఉపకేంద్రాల నిర్వహణ సెస్లో భారంగా మారుతోంది. నిరంతర విద్యుత్తు సరఫరాతో సెస్లో కింది స్థాయి సిబ్బంది కొరత వేధిస్తోంది. గ్రామాల్లో విద్యుత్తు సమస్యల పరిష్కారంలో సహాయకుల నియామకం జరగడంలేదు. దీంతో సమస్యలు తలెత్తినపుడు రైతులు, గ్రామస్థులే తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యత్తు సరఫరా నుంచి నిరంతర విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడంతో సెస్ నుంచి ఎన్పీడీసీఎల్కు చెల్లించాల్సిన బకాయి పెరిగిపోయింది. గత ఏప్రిల్ నుంచి ఎన్పీడీసీఎల్కు రూ.23.08కోట్ల బకాయిలను సెస్ చెల్లించాల్సి ఉంది.