పెండింగ్ చలాన్ కట్టకుంటే అంతే సంగతులు: వెహికిల్ సీజ్, రోడ్లపై పోలీసుల సోదాలు..
హైదరాబాద్ టూ వీలర్ వినియోగదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. పెండింగ్ చలాన్ పే చేయాలని కోరుతున్నారు. లేదంటే వాహనం సీజ్ చేస్తూ.. వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఐదు అంతకన్నా ఎక్కువ చలాన్ ఉన్నవారికి ఇప్పటికే నోటీసులు కూడా పంపిస్తున్నారు. అంతకన్నా తక్కువ లేదా ఎక్కువ ఉన్న వాహనాలను ఆపీ మరీ చెక్ చేస్తున్నారు.
పంజాగుట్ట స్టీల్ వంతెన ప్రారంభం: ట్రాఫిక్ సమస్యలకు ఇక చెక్
చలాన్ పే మెంట్ ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంది. దీంతో వాహనదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. తర్వాత కడదాం లే అని అనుకొంటున్నారు. దీంతో పోలీసులు రహదారులపైకి వచ్చి మరీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు. నంబర్ ఆధారంగా పెండింగ్ చలాన్ తీసి కట్టిస్తున్నారు. ఒకవేళ చలాన్ కట్టకుంటే టూ వీలర్ పోలీసు స్టేషన్కు పంపిస్తున్నారు.
తనిఖీల్లో భాగంగా ఐదు లేదా అంతకన్నా ఎక్కువ చలాన్లు పెండింగ్ ఉన్నవారిని వెంటనే చలాన్ కట్టాలని పోలీసులు అడుగుతున్నారు. వారు అక్కడే చలాన్ కట్టేసి.. బైక్ తీసుకెళ్తున్నారు. ఒకవేళ వాహనం సీజ్ చేస్తే.. పోలీసు స్టేషన్, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని వాహనదారులు భయపడుతున్నారు. వెంటనే చలాన్ కట్టేస్తున్నారు.
వాస్తవానికి లాక్ డౌన్ సమయంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు ఎక్కువగానే విధించారు. 21 లక్షల చలాన్లు విధించగా.. ఆ మొత్తం రూ.14 కోట్లు ఉంటుంది. ఇందులో సగానికిపైగా నో హెల్మెట్ చలాన్ ఉన్నాయి. దీనికితోడు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు కూడా జారీచేసింది. వెనక కూర్చొన్న వారు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసింది. బండికి సైడ్ మిర్రర్ ఉండాలని పేర్కొన్నది. దీంతో వాహనదారులు రోడ్డు మీదకొచ్చేసరికి అన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని రావాలని పోలీసులు కోరుతున్నారు.