మెడికో, పోలీసులకు కూడా వైరస్, మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్రంలో కరోన కరాళ నృత్యం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే 199 పాజిటివ్ కేసులు నమోదడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రజలు భయపడొద్దని, మరింత అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కోరారు. ఈ మేరకు ఆమె సోమవారం ట్వీట్ చేశారు. ఇదివరకు లాగానే మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ.. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతీ ఒక్కరూ మెలగాలని కోరారు.
ఆదివారం వైరస్ సోకిన వారిలో ఇద్దరు మెడికల్ విద్యార్థులు, పోలీసులు కూడా ఉన్నారు. దీంతో మనకు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్. కరోనా వైరస్ నియంత్రించేందుకు ప్రభుత్వం కూడా మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వస్తుండవచ్చని.. కానీ పౌరులు మాత్రం అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉన్న సమయంలో మాదిరిగానే ఇప్పుడు మెలగాలని కోరారు. అసలే వర్షాకాలం వస్తోన్నందున.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న.. ప్రాణం మీదకొస్తుందని జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలను కోరారు.