ప్రజలు బాబును తరిమి కొట్టారు..! అంతులేని ఆనందంగా ఉందన్న మోత్కుపల్లి..!!
హైదరాబాద్: టీడిపి అధినేత చంద్రబాబు పై మాజీ టీడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. దశమగ్రహం అంతరించి పోయినందుకు సంతోషంగా ఉందన్నారు. నరరూప రాక్షసుడు అంతరించిపోయినందుకు ఆనందంగా ఉందని విమర్శించారు. ఏపీలో జగన్ గెలుపొందినందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని, ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరిందని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో పార్టీని బతికించు కుంటామని అన్నందుకు నన్ను పార్టీ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారని, తెలంగాణలో ప్రజలు చంద్రబాబు ను తరిమి కొట్టారని, ఏపీ ప్రజలు కూడా తన్ని తరిమి కొట్టారని అన్నారు.
కేంద్రంలో చక్రం తిప్పుతా అన్న చంద్రబాబు ఏమీ చేయలేక పోయారని ఎద్దేవా చేసారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని నాశనం చేసి, దళితులకు అన్యాయం చేశారని చంద్రబాబుపై మండి పడ్డారు. మాలమాదిగలకు మధ్య కొట్లాట పెట్టిన బాబు, వాళ్ళ ఉసురు తగిలి పోయాడని మండి పడ్డారు. ఏపీ ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మేలైన రోజులు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపినందుకు జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తరువాత బాబు సీఎంగా ఉండొద్దని కోరుకున్నానని చెప్పారు. చంద్రబాబు దొంగ, ప్రజాద్రోహి, నిజస్వరూపం బయట పడేందుకు 25 సంవత్సరాలు పట్టిందని విమర్శించారు. ఎవరైన వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి ఉన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. తాను ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయల్లోకి వచ్చానని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర కాపలాగా కుక్కలా ఉన్న తనను మోసం చేశారని తెలిపారు. రాజ్యసభ సీట్లు ఒక్కొక్కటి వంద కోట్ల కు అమ్ముకున్నారని ఆరోపించారు.
తనకు గవర్నర్, రాజ్యసభ పదవీ ఇస్తానని చెప్పారని, చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి విజయవాడకు పారిపోయారని మోత్కుపల్లి తెలిపారు. తప్పులు సర్దిదిద్దుకున్నోడే లీడరని, తప్పుల మీద తప్పులు చేసే వాడు నాయకుడు కాదని విమర్శించారు. నరరూప రాక్షసుడు అంతం అయినందుకు తెలుగు ప్రజలు పండుగ చేసుకుంటున్నారని, చంద్రబాబును ఓడించాలని వెంకటేశ్వరస్వామిని మొక్కుకున్నానని, తన మొక్కు ఫలించిందని అన్నారు.