రాములమ్మ హల్చల్ : కేసీఆర్ను మరోసారి గెలిపించినందుకు ప్రజలు బాధపడతారు
పెద్దపల్లి : సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఓ రేంజ్లో ఫైరయ్యారు. రెండోసారి కేసీఆర్ను సీఎం చేసినందుకు ప్రజలు బాధపడుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి దఫాలోనే ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారామె. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బుధవారం ఆమె రోడ్ షో నిర్వహించారు. ఆమె రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
అప్పుల ఊబిగా మార్చాడు ..
మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలనే విస్మరించారని .. ఇప్పుడు కొత్తగా ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇవ్వాలని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు విజయశాంతి.
మోదీ, కేసీఆర్ ఒక్కటే
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఒక్కటేనన్నారు విజయశాంతి. టీఆర్ఎస్కు ఓటేసినా అది బీజేపీకి వేసినట్టు తెలిపారు. మోదీని మరోసారి ప్రధానమంత్రి చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వచ్ఛ భారత్ అంటే బ్యాంకుల్లో ఉన్న నగదు ఊడ్చుకోని పోవడమా అని మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదల సంక్షేమాన్ని మోదీ, కేసీఆర్ విస్మరించారని దుమ్మెత్తిపోశారు.
నల్లధనమేదీ ? 15 లక్షలేవీ
మోదీ, కేసీఆర్ పాలన దూరపు కొండలు నునుపు అన్న చందంగా ఉంటాయన్నారామె. గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తీసుకొస్తానని ఆ మాటే మార్చారని దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోసం చేశారని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు.
న్యాయ్తో పేదలకు న్యాయం
ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని విజయశాంతి కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని ఆమె స్పష్టంచేశారు. పేదల ఖాతాలో నెలకు రూ.6 వేలు జమచేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం పేదలపాలిట కల్పతరవు అవుతోందని, వారి జీవన ప్రమాణస్థాయి పెరుగుతుందని తెలిపారు. మోదీ పేదలపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారని .. కాంగ్రెస్ పార్టీ పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందని ముక్తాయించారు.