నల్లధనం, రాజకీయ నేతల 'సరికొత్త' ప్లాన్: తెరుచుకోని ఏటీఎంలు, గంటల్లో అయిపోయింది!
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో కొందరు రాజకీయ నాయకులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని తెల్లగా మార్చుకునేందుకు భలే ప్లాన్ వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను పావులుగా వాడుకునేందుకు ప్లాన్ వేశాయనే వార్తలు వచ్చాయి.
రాజకీయ నాయకులు కూడా అదే దారిలో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో పార్టీలకు పెద్ద చిక్కు వచ్చింది. డిసెంబర్ 31వ తేదీ దాటితే పెద్ద నోట్లు మురిగిపోయే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో పలువురు నాయకులు తలలు పట్టుకున్నారని చెబుతున్నారు. దీంతో ఓ ప్లాన్ కూడా వేశారని అంటున్నారు. ఎలాగు ఎన్నికల్లో ప్రజలకు డబ్బులు పంచి పెట్టాలని, అదేదో ఇప్పుడే పంచి పెడితే బాగుంటుందని భావిస్తున్నారట.
వచ్చే ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్,గోవా తదితర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ప్రభుత్వం నోట్లు రద్దు చేస్తుందని ఊహించని పలు రాజకీయ పార్టీలు వారి వారి మద్దతుదారులకు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున డబ్బులు సిద్ధం చేసిందని అంటున్నారు.
అయితే హఠాత్తుగా రూ.500, రూ.1000 నోట్లు రద్దయ్యాయి. దీంతో ఇప్పుడు ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదని అంటున్నారు. దీంతో ఎన్నికల సమయంలో పంచిపెట్టవలసిన డబ్బును ఇప్పుడే పంచిపెట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. తాము ఇచ్చేది చిన్నమొత్తం కాబట్టి ప్రజలకు డబ్బులు ఇస్తే వారు బ్యాంకులో వేసి కొత్త నోట్లు తీసుకుంటారని భావిస్తున్నారట.
బ్యాంకుల్లో భారీ రద్దీ
రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి కోసం హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. రెండు రోజుల తర్వాత ఏటీఎంలు పని చేస్తాయని చెప్పినప్పటికీ చాలా ప్రాంతాల్లో పలు బ్యాంకుల ఏటీఎంలు పని చేయడం లేదు. ఏటీఎంలలో నగదు నింపకపోవడంతో ఖాతాదారులు నిరాశకు గురవుతున్నారు. ఆంధ్రాబ్యాంకు అనుబంధంగా ఉన్న పలు ఏటీఎంలు పని చేస్తుండటంతో వాటి వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు.
శుక్రవారం ఉదయం నుంచి కొన్ని ఏటీఎంలు తెరుచుకోవటంతో ప్రజలు డబ్బు తీసుకునేందుకు క్యూ కట్టారు. దీంతో ఏటీఎంలలో ఉంచిన డబ్బులన్నీ కేవలం గంటలలోనే ఖాళీ అయ్యాయి. కొన్నిచోట్ల ఏటీంఎలు తెరుచుకోనేలేదు. దీనిపై స్పందించిన బ్యాంక్ అధికారులు అన్ని ఏటీఎంల్లో కొత్త నోట్లు పెట్టేందుకు కొంచెం సమయం పడుతుందని తెలిపారు. డిసెంబర్ 30 వరకు కస్టమర్లు ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉండే వెసులుబాటు కల్పించాంటున్నారు.