భయపెడుతున్నారు, హఠాత్ నిర్ణయమే కానీ: రూ.500, రూ.1000 నోట్లపై వెంకయ్య
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లు రద్దు పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు స్పందించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నప్పటికీ, ఎంతో ఆలోచించి తీసుకున్నదేనని ఆయన స్పష్టం చేశారు.
చట్టబద్ధంగా సంపాదించిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలను భయపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారతాన్ని నిర్మాణం చేయాలని పెద్ద యజ్ఞాన్ని దేశంలో ప్రారంభిచారన్నారు.
ప్రధాని మొదటి నుంచి నల్లధనం నిర్మూళన కోసం కృషి చేస్తున్నారన్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీని నియమించారని, ఆ విధంగా స్వచ్ఛభారత్ అనేది అంచెలంచెలుగా మోడీ అమలు చేస్తున్నారన్నారు.
మంగళవారం రాత్రి ప్రధాని రూ. 500, 1000 నోట్లు రద్దు చేస్తూ చేసిన ప్రకటనను దేశ ప్రజలంతా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారన్నారు.
అవినీతిపరులు, స్వార్థపరులు, స్మగ్లర్లు, టెర్రరిస్టులు తదితరులు దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోతున్నాయన్నారు. మంచి సంస్కరణ వచ్చినప్పడు కొన్ని తాత్కాలిక ఇబ్బందులు తప్పవన్నారు.