జేపీ నడ్డా హైదరాబాద్ ర్యాలీకి అనుమతి నిరాకరణ: ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు, 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో 14 రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు.

బీజేపీ ర్యాలీ అనుమతి నిరాకరణ.. జేపీ నడ్డాను ఎయిర్ పోర్టులోనే..
ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్లో ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు జేపీ నడ్డా నగరానికి రానున్నారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలతో ఎలాంటి ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదని, అందుకే కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో నడ్డాను విమానాశ్రయం వద్దే అడ్డుకోనున్నట్లు సమాచారం. అయితే, ర్యాలీని నిర్వహించి తీరుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బండి సంజయ్ అరెస్ట్ను ఖండిస్తూ దుబ్బాకలో మంగళవారం నిరసన దీక్ష ఏర్పాటుచేశారు. ఆ దీక్షలో పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే, రఘునందన్ను మొదటగా హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దే గృహ నిర్భంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆయన అసెంబ్లీ స్పీకర్, పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి దుబ్బాకకు బయలుదేరారు.
తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద రఘునందన్ అరెస్ట్
ఈ క్రమంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. టీచర్ల సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ జనవరి 2న రాత్రి 7.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జాగరణ దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ దీక్షకు అనుమతులు లేవంటూ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బీజేపీ శ్రేణులు 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొనాలని తెలిపాయి. ఇందులో భాగంగా దీక్షలలో పాల్గొనడానికి వెళ్తున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.