యజమాని కోసం తన ప్రాణాలు వదిలిన శునకం.. తట్టుకోలేక కన్నీరుమున్నీరైన కుటుంబం..
శునకం అంటేనే విశ్వాసానికి మారు పేరుగా పరిగణిస్తారు. చాలామంది యజమానులు పెంపుడు శునకాలతో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉంటారు. అవి కూడా వారి పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. రాత్రిపూట ఇంటి గేటు వద్ద ఏ చిన్న అలికిడి అయిన వెంటనే శునకాలు యజమానిని అప్రమత్తం చేస్తాయి. అంతేనా.. ఒకవేళ రాత్రి వేళ యజమాని బయటకెళ్లినా.. పెంపుడు శునకం కూడా వెంటే బయలుదేరుతుంది. దారి పొడవునా వీధి కుక్కలను నిలువరిస్తూ.. తిరిగి ఇల్లు చేరేదాక యజమానికి ఏ ఆపద రాకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాంటి ఓ శునకం.. తన యజమానికి కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
పాము కాటుకు బలైన శునకం
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోపాలకుంటకు చెందిన కిశోర్ అనే వ్యక్తి.. తమ ఇంట్లో చాలాకాలంగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. శునకం అన్న మాటే గానీ.. కుటుంబ సభ్యుల్లో అదీ ఒకరుగా కలిసిపోయింది. అలాంటి శునకం శనివారం రాత్రి పాము కాటుకు బలైపోయింది.యజమాని ప్రాణాలను రక్షించేందుకు పాముతో చివరిదాకా పోరాడిన ఆ శునకం చివరకు ప్రాణాలు వదిలింది.
యజమానిని రక్షించి
శనివారం సాయంత్రం కిశోర్ తన ఇంటిలోని వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ఓ తాచు పాము అతని మంచం కిందకు దూరడాన్ని పెంపుడు శునకం గమనించింది. వెంటనే కిశోర్ గదిలోకి వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నిద్ర లేచిన కిశోర్ మంచం కింద పామును చూసి షాక్ తిన్నాడు. అయితే యజమానిని రక్షించేందుకు ఆ పామును శునకం నోట కరిచి బయటకు లాక్కెళ్లింది. అనంతరం కిశోర్ ఓ కర్రతో పామును కొట్టి చంపాడు. అయితే శునకం పామును నోట కరిచిన సమయంలోనే అది దాన్ని కాటువేసింది.
కంట తడి పెట్టిన యజమాని
పాము కాటుకు పెంపుడు శునకం నురుసులు కక్కింది. పామును చంపేశాక కిశోర్ శునకాన్ని తన బైక్పై సమీపంలోని పశు వైద్యశాలకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో అది మరణించింది. తన ప్రాణాన్ని అడ్డుపెట్టి మరీ తనను కాపాడిన శునకం మరణించడం కిశోర్ను కంటతడి పెట్టించింది. కిశోర్ భార్య,కుటుంబ సభ్యులు కూడా దాని మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.