మాజీ ఎంపి మధుయాష్కీపై చెక్బౌన్స్ కేసు
హైదరాబాద్: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారన్న అభియోగాలపై నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్పై కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన బూరుగు రామస్వామి అనే వ్యాపారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో తన వద్ద రూ. 30 లక్షలు తీసుకుని తర్వాత బ్యాంకులో నగదు నిల్వలేని చెక్కును ఇచ్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోరుట్లకు చెందిన బూరుగు రామస్వామిగౌడ్, పడాల నారాయణ, భీమిరెడ్డిల నుంచి ఎన్నికల ఖర్చు కోసం మధుయాష్కీ రూ. 30లక్షల చొప్పున మొత్తం రూ. 90లక్షలు ఈ ఏడాది ఏప్రిల్లో తీసుకున్నారు. ఇందులో రామస్వామిగౌడ్ ఏప్రిల్ 18, 2014న రూ. 30లక్షలు ఇవ్వగా.. మధుయాష్కీ అతడికి జూన్ 11, 2014 తేదీతో సిండికేట్ బ్యాంక్, బంజారాహిల్స్ శాఖ చెక్కును ఇచ్చారు.
ఆ చెక్కును సెప్టెంబర్ 3, 2014న బ్యాంకులో జమచేయగా ఖాతాలో నిల్వ లేదంటూ మరుసటి రోజు బ్యాంకు అధికారులు చెక్కును తిప్పిపంపారు. దీనిపై ఆయన మధుయాష్కీని ప్రశ్నించారు.
ఆ సమయంలో తనను బెదిరించాడని రామస్వామి బుధవారం నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో ఫిర్యాదును స్వీకరించింది. దీనిపై ఆర్థిక నేరాల విభాగం ఢిల్లీలోనూ ఫిర్యాదు చేయనున్నామని బాధితుడి తరపు న్యాయవాది వెల్లడించారు.
ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మధుయాష్కీ ఓడిపోయిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కవిత నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు.