టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల సంఘంకు సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను పేర్కొనలేదని, ఎన్నికల సంఘం నిబంధనలను పాటించనందున ఆయన ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.
కాంగ్రెస్ నేత మదన్మోహన్ రావు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షిద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా బీబీ పాటిల్, ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ పిటిషన్లో చేర్చారు. విచారించిన హైకోర్టు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మదన్మోహన్ రావు.. బీబీ పాటిల్ చేతిలో ఓటమిపాలయ్యారు. లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి 9, కాంగ్రెస్ 3, బీజేపీకి 4 ఎంపీ స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎంఐఎంకు 1 ఎంపీ స్థానంలో గెలిచింది.
ఇది ఇలా ఉండగా,ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేసింది హైకోర్టు. శుక్రవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్కు పలు ప్రశ్నలు సంధించింది న్యాయస్థానం. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం ఎందుకు నిలువరించ లేకపోతోందని నిలదీసింది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదలావుంటే నాంపల్లి కోర్టు దగ్గర సమ్మెకు సంఘీభావం ప్రకటించి లాయర్లు నిరసన తెలపడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో టెన్షన్ సిట్యువేషన్ కనిపించింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మంగళవారం (15.10.2019) నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా అటు కార్మికులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. అయితే రెండు రోజుల్లో సమస్య పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆదేశించింది. ఆ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం నాడు మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది న్యాయస్థానం. అసలు సమ్మెను ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోందని నిలదీసింది. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న న్యాయస్థానం ఆ మేరకు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్టీసీకి కొత్త ఎండీ నియామకంపై అడిగిన ప్రశ్నకు.. కొత్త ఎండీని నియమించడం వల్ల సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదని.. ఇప్పటికే అక్కడ సమర్థవంతమైన అధికారి ఇన్ఛార్జ్గా ఉన్నారనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అడ్వకేట్ జనరల్. దాంతో హైకోర్టు మరో ప్రశ్న సంధించింది. ఇప్పుడున్న అధికారి సమర్థుడైతే ఆయన్ని ఎండీగా ఎందుకు నియమించలేదని అడిగింది.