తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్, విజయవాడలో ఎంత? ఎందుకు తగ్గాయంటే?
హైదరాబాద్: వాహనదారులకు తీపి కబురు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. వరుసగా మూడోరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం లీటర్ పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 27 పైసలు తగ్గాయి.
కరోనా ఎఫెక్ట్..
ఫిబ్రవరిలో మొత్తంగా పెట్రోల్ లీటర్కు 82 పైసలు, డీజిల్ లీటర్కు 85 పైసలు తగ్గింది. జనవరి 12 నుంచి తగ్గడం ప్రారంభించిన ఇంధన రేట్లు ఇంకా అదేబాటలో కొనసాగుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ముడిచమురును కూడా తాకినట్లు తెలుస్తోంది.
చైనాలో భారీగా తగ్గిన డిమాండ్..
చమురుకు డిమాండ్ ఎక్కువగా ఉండే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో చమురు వాణిజ్యం తీవ్ర ప్రభావానికిగురైంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ముడి చమురు ధర గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తోంది. వారంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. బ్రెంట్ ముడి బ్యారెల్ 54.50 వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్ తోపాటు విజయవాడలో ధరలు..
హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.08 కాగా, డీజిల్ ధర రూ. 71.35గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.63 కాగా, డీజిల్ ధర రూ. 70.91గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..
ఇతర ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 72.45 కాగా, డీజిల్ ధర రూ. 65.43గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.11 కాగా, డీజిల్ ధర రూ. 68.57గా ఉంది. కోల్కతా నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.13 కాగా, డీజిల్ ధర 67.79గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.27కాగా, డీజిల్ లీటర్ ధర రూ. 69.10గా ఉంది. గత కొంత కాలంగా పెరిగిన ధరలు ఒక్కసారిగా తగ్గుతుండటంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ తగ్గింపు ధరలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. మళ్లీ చమురు డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.